జరిగిందేదో జరిగింది!: వనజాక్షి ఇష్యూపై బాబు, సెక్షన్ 8పై రాజ్తో మాట్లాడా
న్యూఢిల్లీ: అక్టోబర్ 22వ తేదీన రాజధాని అమరావతికి శంకుస్థాపన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం చెప్పారు. జపాన్ పర్యటన విజయవంతమైందని ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఆయా సంస్థలకు భూమి మీద హక్కు ఉండదని, కానీ అభివృద్ధి పైన హక్కుంటుందన్నారు. నాడు హైదరాబాదులో అభివృద్ధి పరంగా ఊపు వచ్చినట్లు అమరావతిలో వస్తుందన్నారు. అమెరికా, చైనా వంటిచోట్ల చెత్త నుండి విద్యుత్ తీస్తున్నారన్నారు.
నవంబరులో వెళ్లినప్పుడే జపాన్ ప్రతినిధులతో రాజధాని నిర్మాణంపై చర్చించామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్ పారిశ్రామికవేత్తలకు ఈ పర్యటనలో వివరించామని చెప్పారు. అక్వాపై మయోకావో కార్పోరేషన్ శ్రద్ధ చూపారన్నారు.

విశాఖ - చెన్నై కారిడార్ ఏడీబీ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేశారన్నారు. జైకా, జెబిక్ వంటి ప్రభుత్వ సంస్థలతో చర్చించామన్నారు. అమరావతిలో మిజహో బ్రాంచి పెట్టాలని వారిని కోరామని చెప్పారు. ఏపీలో సోలార్ పానెల్ తయారీకు ముందుకు రావాలని కోరినట్లు చెప్పారు.
పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్ఏసీ ముందుకు వచ్చిందని తెలిపారు. సేఫ్ సిటీగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ఎన్ఏసీ ముందుకు వచ్చిందన్నారు. ఫిజి ఎలక్ట్రికల్స్ను కలిసి రాష్ట్రంలో పరిశ్రమ పెట్టుబడులపై మాట్లాడామన్నారు.
జపాన్ పర్యటన సంతృప్తి కలిగించిందన్నారు. పుడ్ ప్రాసెసింగులో పెట్టుబడులకు జపాన్ ముందుకొచ్చిందన్నారు. పలు కంపెనీలతో చర్చించామన్నారు. అమరావతిని ఫైనాన్షియల్ హబ్గా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 2029 నాటికి ప్లాన్ తయారు చేయలని జైకాను కోరామన్నారు.
సుమిటోమో కార్పోరేషన్ శ్రీకాకుళంలో అల్ట్రా మెగా కోల్ పవర్ స్టేషన్ ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. శ్రీకాకుళంలో జెబిక్ మెగా పవర్ ప్రాజెక్టు పెట్టుబడులకు ముందుకు వస్తోందన్నారు. నూతన రాజధానిలో భాగస్వాములం అవుతామని చాలామంది ముందుకు వచ్చారన్నారు.
ఫార్మా రంగంలో ఐసీఐజేతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. పెట్రోలియం, ఎల్ఎన్జీ యూనిట్ల స్థాపనకు మెజీ, షికాయ్ ఫార్మా, జెబిసి తదితర సంస్థలు ముందుకొచ్చాయన్నారు. సింగపూర్ మాస్టర్ ఉచితంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిందన్నారు.
వనజాక్షి దాడిపై చంద్రబాబు!
వనజాక్షిపై జరిగిన దాడిపై చంద్రబాబు స్పందించారని తెలుస్తోంది. జరిగిందేదో జరిగిపోయిందని, అసలు ఎందుకు జరిగిందో తెలుసుకుంటానని ఆయన చెప్పారు. ఇప్పటికే తాను వనజాక్షితో మాట్లాడానని ఆయన చెప్పారు.
మరోవైపు, ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 గురించి తాను హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్తో మాట్లాడనని చెప్పారు. విభజన చట్టంలో అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత హోంశాఖదే అని చెప్పారు. మొన్నటి వరకు విద్యుత్ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం విమర్శించిందని, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుపై తమను విమర్శిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications