పొత్తుల కోసం తహతహ: ముందస్తు రాజకీయాలపై బాబు కీలక భేటీ, కేరళకు 2వేల మెట్రిక్టన్నుల బియ్యం
అమరావతి: ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ శ్రేణులని సిద్ధం చేసే పనిలో పడింది. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

ముందస్తు ఎన్నిలు, పొత్తులపై..
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకే అవకాశం ఉందన్న భావనను నేతలు చంద్రబాబు వద్ద వ్యక్తం చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై తెలంగాణ టీడీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం.
Recommended Video


టీడీపీతో పొత్తు కోసం తహతహ
తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఉభయ తారకంగా ఉండేలా పొత్తులు ఉంటే బాగుంటుందని మంత్రులు, నేతలు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తగ్గిందని నేతలు సీఎంకు వివరించారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రాభవం రోజు రోజుకూ తగ్గుతోందని నేతలు చెప్పారు. కాగా, తెలంగాణలో టీడీపీతో పొత్తుకు అక్కడి పార్టీలు తహతహలాడుతున్నాయనే విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

హోదా ఇవ్వనన్న బీజేపీతో వైసీపీ.. కాంగ్రెస్ మాత్రం..
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతోందన్న అంశంపైనా చర్చించారు. కాంగ్రెస్ పార్టీతో వ్యవహరించాల్సిన వైఖరిపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ప్రత్యేక హోదా ఇవ్వం అంటున్న బీజేపీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని, కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

దేశ రాజకీయాల్లో టీడీపీ..
రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో టీడీపీ పాత్ర ఎలా ఉండాలనే దాని పై కూడా చంద్రబాబు చర్చించారు. టీడీపీ కీలకంగా వ్యవహరించనుందని చెప్పారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు.

కేరళకు 2వేల టన్నుల బియ్యం..
కేరళ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించింది. ఇందులో భాగంగా సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద బియ్యంతో బయలుదేరిన మూడు లారీలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపారు. రెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళలోని 5జిల్లాల బాధితులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం పంపిణీపై ఇప్పటికే కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారులకు ఏపీకి చెందిన అధికారులు సమాచారం అందించారు. కేరళ వరద బాధితుల కోసం రూ.10కోట్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications