ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ధనవంతుడు: జయలలిత ఆ తర్వాతే...
విజయవాడ: భారతదేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని తేలింది. భారతదేశంలోని అందరు ముఖ్యమంత్రుల ఆస్తుల నివేదిక ప్రకారం చంద్రబాబు నాయుడు అందరికన్నా ధనవంతుడని తేలింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయన తర్వాతే ఉన్నారు.
చంద్రబాబుకు అరుణాచల్ప్రదేశ్ సిఎం ఒక్కరే కాస్తా పోటీ ఇస్తున్నారు. మిగిలిన వారంతా చాలా దూరంలో ఉన్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఇడబ్ల్యు) రూపొందించిన నివేదిక ఆ విషయం వెల్లడిస్తోంది.
ఎన్నికల సంస్కరణలు, ఇతర అంశాలపై చాలాకాలం నుంచి అధ్యయనం చేస్తున్న ఈ సంస్థలు, తాజాగా గత ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించింది.
ఆ ప్రకారం చంద్రబాబునాయుడుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్తులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాన్ని అరుణాచల్ప్రదేశ్ సిఎం పెమా ఖండు ఆక్రమించారు. ఆయనకు 129 కోట్ల 57 లక్షల 56 వేల 014 రూపాయల ఆస్తులున్నాయి. ఈ విషయంలో జయలలిత మూడవ స్థానంలో ఉన్నారు. ఆమెకు 113 కోట్ల 73 లక్షల 38 వేల 586 రూపాయల ఆస్తులున్నాయని నివేదిక తేల్చింది.
చంద్రబాబు మంత్రుల్లో నారాయణ టాప్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన మంత్రివర్గంలో ఉన్న 20 మందిలో 18 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ వెల్లడించింది. అంటే ఇద్దరు మంత్రులే పేదరికంలో ఉన్నారని తేలింది.
అయితే, ప్రతి సెప్టెంబరు మాసంలో తరచూ మీడియా సమక్షంలో తన కుటుంబసభ్యుల ఆస్తులు వెల్లడించే సంప్రదాయం ఉన్న బాబు, తన వివరణ పత్రంలో ఎక్కడా అరకోటి ఆస్తులున్నట్లు కూడా ప్రకటించలేదు. కానీ ఈ నివేదిక మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.