ఎన్టీఆర్ క్యాంటీన్ సహా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ శుక్రవారం భేటీ అయి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమావేశం వివరాలను వెల్లడించారు. టీడీపీ స్వచ్ఛమైన, నీతివంతమైన, పారదర్శక పాలన అందించాలని చూస్తోందన్నారు. అందుకోసం ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుందన్నారు. తక్కువ ధరలకు మందులు అందించేందుకు జనరిక్ ఔషధాలు దుకాణాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ ధరకే అల్పాహారం అందించడం ఎన్టీఆర్ క్యాంటీన్ల లక్ష్యమన్నారు. సమైక్యంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల పైన కేసులు ఎత్తివేస్తామని చెప్పారు. గ్రామాల్లో వాటర్ షెడ్ల పరిధిలో రెండు లక్షల హెక్టార్లలో మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఐటీ కంపెనీలు స్థాపిస్తే ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు.
చంద్రబాబు పైన ప్రజలు విశ్వాసం ఉంచి గెలిపించారని, తాము హామీ ఇచ్చిన ప్రకారం అన్నింటిని నెరవేర్చుతామన్నారు. విశాఖ, వీజీటీఎం పరిధిలో మెట్రో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఒక్కో ఉద్యోగి పైన రూ.60వేల రాయితీ ఐటీ కంపెనీలకు ఇస్తామన్నారు. ఐదేళ్లలో కరువు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలను నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో నెల రోజుల పాటు బదలీలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు చెప్పారు.

పేదవారికి అందుబాటులో ఉండేలా ఇసుక ధరలు ఉంటాయన్నారు. ఆరు నుండి 14 ఏళ్లలోపు విద్యార్థులు బడికి వెళ్లేందుకు బడికి పిలుస్తోంది కార్యక్రమం, రైతుల కోసం మూడు నెలల పాటు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల వద్దకు వెళ్లి సూచనలు చేస్తాన్నారు. మంగళ, బుధవారాల్లో ఇది ఉంటుందన్నారు. నూరు శాతం అక్షరాస్యత తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. కాగా, ఈ నెల 16 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 18న బడ్జెట్ ఉంటుంది.
కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
ఉద్యోగుల బదలీలపై నిషేదం ఎత్తివేస్తూ నిర్ణయం
ఎన్టీఆర్ క్యాంటీన్ అమలుపై ముగ్గురితో కమిటీ
దేవాలయ కమిటీలు, నామినెట్ పోస్టులు రద్దు, టీటీడీ కూడా రద్దు
ఇసుక రీచ్ లలో 25 శాతం డ్వాక్రా మహిళలకు,
కొత్త ఐటీ పాలసీకి రూపకల్పన
ఐటి కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రత్యేక రాయితీలు
ఐదువేల మందికి ఉపాధి కల్పించే ఐటి ప్రాజెక్టులకు రాయితీలు
అక్టోబర్ 2 నుండి గృహాలు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్
ఇసుక రీచ్లలో 25 శాతం డ్వాక్రా మహిళలకు
ఇసుక రీచ్ల వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు
నీరు చెట్టు కార్యక్రమం, ఐదేళ్లలో కరువు నివారణ రాష్ట్రంగా ఏపీ
తక్కువ ధరలకు ఔషదాలు అందించే జనరిక్ మందుల దుకాణాలు
రెండున్నర లక్షల హెక్టార్లలో మొక్కలు నాటడం












Click it and Unblock the Notifications