ఏపీలో వారికి అమృత ఆరోగ్య పథకం.. రూ.2.50 లక్షల వైద్యసేవలు ఉచితం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తోంది. ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అందరికీ సంక్షేమాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం శతవిధాల కృషి చేస్తోంది. ఇక ఇదే క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న అమృత ఆరోగ్య పథకాన్ని మరింత విస్తరించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది.
ఏపీలో వారికి అమృత ఆరోగ్య పథకం
అనాధలు, నిరాశ్రయులు, వృద్ధులకు అమృత ఆరోగ్య పథకం వర్తింపులో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,812 మందికి అమృత ఆరోగ్య పథకాన్ని వర్తింప చేస్తున్న ఏపీ ప్రభుత్వం అదనంగా 1113 మంది నిరాశ్రయులు, వృద్ధులు, అనాధలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వులను జారీ చేశారు.

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు
తదుపరి చర్యలను తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ కు ఆయన సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద ఉన్న 2812 మందికే కాకుండా అదనంగా చేర్చిన వారికి కూడా కలిపి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు.
వీరి ఆరోగ్య రక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వ శ్రద్ధ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత ఆరోగ్య పథకం కింద 1044 థెరపీలు, సర్జరీలతో పాటు ప్రతి సంవత్సరం రెండు లక్షల 50 వేల రూపాయల వరకు వారికి ఉచిత వైద్య సహాయాన్ని అందిస్తారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరికి మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిరాశ్రయులు, వృద్ధులు, అనాధలకు సైతం ఆరోగ్య రక్షణ విషయంలో భరోసానిస్తూ ముందుకు సాగుతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర పథకాలతో కలిపి అందిస్తున్న ఏపీ సర్కార్
ఏపీలోని కూటమి ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న భరోసాతో కలిపి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ లో భాగంగా అనాధలకు, వృద్ధులకు వైద్య సదుపాయాలు అందించడానికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని అందిస్తోంది.












Click it and Unblock the Notifications