మేసిన వారి భరతం పడ్తాం: బాబు, కడిగేస్తా: జగన్
హైదరాబాద్: ప్రభుత్వ ఆదాయాన్ని పందికొక్కుల్లా మేసే వారి భరతం పడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం శాసన సభలో అన్నారు. 2004 నుంచి 2014 వరకు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు.
డ్వాక్రా సంఘాలను పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సముద్రంలో కలిసే మూడువేల టీఎంసీల్లో వెయ్యి టీఎంసీలు వాడుకుంటే రాష్ట్రంలో కరువు ఉండదన్నారు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు.

వాగ్వాదం
శాసన సభలో అంతకుముందు జగన్, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగం పైన ప్రతిపక్ష నేత మాట్లాడక పోవడం ఇదే మొదటిసారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో గందరగోళం చెలరేగింది. వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
జగన్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదని చెప్పారని, దీనిని బట్టి ఆయన ఎంత సేపు మాట్లాడారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో మిమ్మల్ని కడిగి పారేస్తానన్నారు. దీనిపై అచ్చెన్నాయుడు కల్పించుకుంటూ మమ్మల్ని కడిగేకంటే ముందు మీకు అంటిన అవినీతి మురికి కడుక్కోవాలని, అది ఎంత కడిగినా పోదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు వచ్చాక జాబు ఊడిందని ప్రజలు భావిస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు. బాబు వస్తే జాబొస్తుందని నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఆయనను గెలిపిస్తే వారిని మోసం చేశారన్నారు. డీఎస్సీ అభ్యర్ధులు ఎంతో ఆశగా బాబు వైపు దీనంగా ఎదురు చూస్తున్నారన్నారు.
బాబుకు మహిళలు అంటే చులకన: రోజా
చంద్రబాబు మహిళా ద్రోహి అని రోజా మీడియా పాయింట్ వద్ద మండిపడ్డారు. మహిళా ఓట్ల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటి వరకు ఆ ఊసెత్తడం లేదన్నారు. డ్వాక్రా రుణాలపై చర్చ జరగాలని పట్టుపడితే ఇప్పుడా అంశం అంత ముఖ్యమా అన్నారని, ఈ వ్యాఖ్యల ద్వారానే చంద్రబాబుకు మహిళలు అంటే ఎంత చులకనో అర్థమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications