కేసీఆర్ జిమ్మిక్కులతో ఏంకాదు, గెలుపు మనదే: బాబు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీదేనని, అలాగే 2019 ఎన్నికల్లోను టీడీపీయే గెలుస్తుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిమ్మిక్కులు పని చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులున్నా తెలంగాణలో 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. గత పదేళ్ల లో ఐదేళ్లు వైయస్ పాలన, ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో టీడీపీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నదన్నారు.
కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీడీపీని ఏమీ చేయలేరన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అధ్యక్షతన జరిగిన గ్రేటర్ పార్టీ (హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీతో ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న పార్టీలు ప్రయోజనం పొందాయన్నారు. గతంలో టీడీపీని దెబ్బతీయాలనుకున్న ఇందిరా గాంధీ సైతం ఏమీ చేయలేకపోయారన్నారు.

ప్రజావ్యతిరేక విధానాల వల్ల కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ నేతలు విర్రవీగడం మంచిది కాదని, ప్రజావ్యతిరేక నిర్ణయాలు అమలు చేస్తే తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలకు సిద్దంగా ఉటుందన్నారు. టీడీపీ నేతలకు కేంద్రంలో నామినేటెడ్ బోర్డుల్లో పదవులు కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణలో పార్టీ బలపడడానికి అవసరమైన విధంగా సహకరిస్తానన్నారు.
ఎన్టీఆర్ భవన్లో తనతో పాటు లోకేష్, గరికపాటి రామ్మోహన్ రావు తెలంగాణ నేతలకు అందుబాటులో ఉంటామన్నారు. ప్రతి శనివారం టీటీడీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తానని, ప్రతి మంగళవారం లోకేష్ను పార్టీ నేతలు కలుసుకోవచ్చన్నారు.విద్యార్థులు నష్టపోకుండా ఫీజు రీయింబర్స్మెంట్కు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధగా ఉన్నామని, రెండు ప్రభుత్వాలు 58:42 నిష్పత్తిలో భరించాలని తాను కోరినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications