ఫోన్ ట్యాపింగ్పై పక్కా ఆధారాలు, ఎదురుదాడే: చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నాయకుల ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు, ఎలా ట్యాపింగ్ జరిగిందో ఆధారాలు ఉన్నాయని మంత్రులకు చంద్రబాబు చెప్పారు. వారు నోటీసులు ఇస్తే మనమూ ఇద్దామని చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, తెలంగాణ కేసులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన మంత్రులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించారు. బుధవారంనాడు ఆరు గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నోటుకు ఓటు వ్యవహారంపైనే కాకుండా ఇతర విషయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

నోటుకు ఓటు కేసు విచారణపై ఎన్నికల కమిషన్ తెలంగాణ ఎసిబికి రాసిన లేఖపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రభుత్వానికి కల్పిస్తున్న అడ్డంకులపై కూడా చర్చించారు.

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 22న ఏపీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని, వచ్చే మూడేళ్లలో విజయవాడ మెట్రో రైలు పనులు పూర్తి చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
మూడు నెలలుగా తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని, సెక్షన్ 8 చెల్లదంటే రాష్ట్ర విభజనే జరగనట్టు అర్థమని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాజధానిలో ఏడాదికే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన తొమ్మిదేళ్లలో పరిస్థితి ఏమిటని మంత్రులతో చంద్రబాబు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్ర ప్రజలను ద్వేషిస్తున్నారంటూ హైదరాబాద్లో పనిచేస్తున్న ఏపీ పోలీసులకు తాము జీతాలిస్తుంటే వారిని తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. ముంపు మండలాల పోలీసులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు.












Click it and Unblock the Notifications