పరిస్థితి బాగు లేదు: కేంద్రాన్ని వేడుకున్న చంద్రబాబు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి చెప్పుకుని వెంటనే ఆదుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆర్థిక సమస్యలున్నాయి కాబట్టే సంక్రాంతి పండుగ ఉన్నా ఢిల్లీకి వచ్చి పరిస్థితిని వివరించానన్నారు.
ఆయన గత రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభుసహా పనె్నండుమంది మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల గురించి వివరించారు. సమస్యలున్నాయి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ది పనులు కూడా చేపట్టకుండా ఇంతకాలం ఎలాగో లాగుకు వచ్చాంకానీ ఇక మీదట ఇది సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే పెద్దయెత్తున ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. కేంద్రం కూడా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది కాబట్టే రాష్ట్రానికి సహాయం అందజేయటంలో కొంత ఆలస్యమవుతోందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఇవ్వవలసిన ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, విశాఖలో రైల్వే జోన్, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయటం వంటి ఆరు ముఖ్యమైన అంశాలను ప్రధానికి, మంత్రులకు వివరించానన్నారు.

హుధూద్ తుపాను సహాయ, పునరావాస పనులకోసం ప్రధానమంత్రి ప్రకటించిన వెయ్యి కోట్లలో కొంత మొత్తం అందిందని, మిగతాది అందవలసి ఉన్నదన్నారు. కొత్త రాజధానికి రాయలసీమలోని కర్నూలు, హైదరాబాదునుండి జాతీయ రహదారులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. దుగ్గరాజుపట్నం ఓడరేవు విషయం కూడా చర్చించినట్లు తెలిపారు. సాగర్మాల కింద కాకినాడ నుండి పాండిచ్చేరి వరకు సముద్ర మార్గం ఏర్పాటు చేయాలన్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఉత్పత్తుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ను కోరారు. రాష్ట్ర విభజన జరిగి ఏడు నెలలు కావస్తోందని, ఈ ఏడు నెలల్లో కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్కు ఆశించిన స్థాయిలో ఆర్థిక సహాయం లభించలేదెందుకని ప్రశ్నించగా కేంద్రం కూడా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆంధ్రప్రదేశ్కు సహాయం అందటంలో కొంత జాప్యం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. హుధూద్ తుపానుకు ప్రధాన మంత్రి ప్రకటించిన వెయ్యి కోట్ల ఆర్థిక సహాయం పూర్తిగా అందకపోవటానికి గల కారణం ఏమిటని ప్రశ్నించగా కేంద్రంలోని మంత్రులందరితో మాట్లాడుతున్నామని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఆశించిన సహాయం అందుతుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి అందవలసిన ఆర్థిక సహాయం గురించి మంత్రులందరిని ఒప్పించేందుకే తాను ఇన్నిసార్లు ఢిల్లీకి వస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రోత్సాహకాలు రాలేదు కాబట్టి పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. రాజధాని నిర్మాణానికి చేపట్టిన లాండ్ పూలింగ్ పద్ధతి మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. భూములిచ్చిన రైతులకు కూడా లాభం కలుగుతోందని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి సింగపూర్, జపాన్ కూడా సహాయం చేస్తోందని, రాజధానితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జపాను ఆసక్తి చూపిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
గోదావరి పుష్కరాలకు ప్రారంభోత్సవం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేసిన ఐదువేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించటంతోపాటు ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications