భూముల రీ సర్వే పేరుతో జగన్నాటకం ..ఆరు రకాల భూములపై జగన్ నజర్: చంద్రబాబు సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూముల సర్వే పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు వేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. చుక్కల భూములు, అసైన్డ్ భూములు, సొసైటీ భూములు ఇలా ఆరు రకాల భూములపై సీఎం జగన్ కన్ను పడిందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రజల భూములకు రక్షణ కష్టమే .. సమగ్ర భూసర్వే తో నష్టం
భూముల సర్వే అంటూ సీఎం జగన్ సర్కార్ హడావుడి చేయడానికి కారణం ఇదేనని పేర్కొన్నారు. భూ సర్వేతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ భూములు ఏ రోజుకారోజు సరిచూసుకోవలసిన పరిస్థితిని కల్పించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సమగ్ర భూ సర్వే తో ప్రజలు ఆందోళన పడాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జగన్ అండతో వైసీపీ ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది
వైసీపీ నేతలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్న చంద్రబాబు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇళ్ల స్థలాలకు ఏమాత్రం పనికిరాని ముంపు భూములు , ఆవ భూములు విపరీతమైన ధరలకు ప్రభుత్వంతో కొనిపించి వేలకోట్లు దుర్వినియోగం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక వాటిని మెరక చేయడం కోసం మరో రెండు వేల కోట్లను దుర్వినియోగం చేశారని, మొత్తం రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల భూసేకరణ కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.
సర్వే పేరుతో జగన్నాటకం
సర్వే పేరిట జగన్ నాటకం ఆడుతున్నారని జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య సంఘటన వైసీపీ కార్యకర్తల ఆస్తులకే రక్షణ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు . దేవాలయాలలో అత్యాచారాలకు పాల్పడడం ,దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేయడం జె గ్యాంగ్ కు నిత్యకృత్యంగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు.
ఇళ్ళ స్థలాలకు భూసేకరణకు నాలుగు వేల కోట్ల కుంభకోణం
ఇతర ప్రాంతాలకు చెందిన న్యాయమూర్తులు రాష్ట్ర పరిస్థితులపై ఆవేదన చెందుతున్నారు కానీ వైసీపీ నేతల్లో పశ్చాత్తాపం మచ్చుకు కూడా కనిపించడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఉద్యోగాలకు గండి కొట్టడం మాత్రమే కాదు, ఏజెన్సీ ప్రాంతాలలో బాక్సైట్ దోపిడీకి ప్రభుత్వం తెరదీసింది అని చంద్రబాబు మండిపడ్డారు. ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు కలిసి నాలుగు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.