మీడియాతో చంద్రబాబు చిట్ చాట్-ముందస్తు ఎన్నికలు, పొత్తులు సహా కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ కొత్త ఏడాది సందర్భంగా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో చంద్రబాబు తన అభిప్రాయాలు పంచుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారని జగన్ సర్కార్ ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకుని రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారని ఆయన ఆరోపించారు.. గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారని విమర్శించారు. ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారని, కానీ గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ గొడవలెందుకని ఇంకొందరు వలస పోతున్నారన్నారు.

ప్రభుత్వం అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారని, ఎన్నికల్లో అన్ని తేలుస్తారని చంద్రబాబు హెచ్చరించారు.ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని, వస్తే సిద్దంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని, తాను దానిపై స్పందించనన్నారు. కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదుని, దీంతో జగన్ బతికిపోయాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాలతో సమావేశం అవుతానని,త ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు.
లీడర్లు పని చేయకుంటే మారిపోతారని సొంత పార్టీలో నేతల్ని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదని, పని చేయని ఇన్చార్ఝులను పక్కన పెట్టేస్తామన్నారు. ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని,దిగుబడులు తగ్గాయని, పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని చంద్రబాబు ఆరోపించారు.
ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రం దిగుబడుల్లో వెనకపడిందన్నారు. మిర్చి పంట పూర్తిగా నష్టపోయిందని, టీడీపీ హయాంలో బిందు సేద్యం 90 శాతం సబ్సిడీ మీద ఇచ్చామని, ఇప్పుడు అస్సలు ఆ ప్రస్తావనే లేదన్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో టీడీపీ ఎంతో చేసిందని, వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి కంటే జగన్ ఏదో చేస్తాడని ప్రజలు భావించారు.. ఇప్పుడు ఆ భ్రమలు తొలుగుతున్నాయన్నారు. ఇకపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications