చిన్నాన్న వివేకానంద ను ఎవరు చంపారో చెప్పే ధైర్యం లేని వ్యక్తి సీఎం నా ? చంద్రబాబు సూటి ప్రశ్న
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని మండిపడిన చంద్రబాబు రాష్ట్రం జగన్ జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు ఎవరు చంపారు అనే విషయాన్ని తేల్చలేక పోయారు అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో చెప్పే ధైర్యం లేని వ్యక్తికి సిఎం పదవి కావాలా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
చట్టాలను తన చుట్టంగా మార్చుకొని జగన్ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అందరూ అవినీతిపరులని ఆరోపణలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి తానొక్కడే నీతిమంతుడు అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన చంద్రబాబు వివేకానంద రెడ్డి హత్య విషయంలో రేకెత్తించిన అంశం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ వై ఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే . ఇక ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ వివేకా హత్యా కేసు దర్యాప్తుకు సిట్ ను నియమించింది .
ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావటంతో జగన్ ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న మిస్టరీని ఛేదించే లేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ సరిగ్గా విచారణ చేయలేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం మరోమారు సిట్ ను ఏర్పాటు చేసింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు దర్యాప్తు చేస్తూనే ఉన్న సిట్ అధికారులు ఈ కేసును ఇప్పటివరకు చేధించలేక పోవడం గమనార్హం. ఇక అదే విషయాన్ని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించి వివేకానంద కేసు పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ కు సూటి ప్రశ్న వేశారు.