బెజవాడలో బాబు మకాం, కేసీఆర్తో లంచ్కి సిద్దమని..
హైదరాబాద్: తాను విజయవాడలో మకాం పెడతానని, వారానికి రెండు రోజులు జిల్లాలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సంపాదకుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో దశలవారీగా.. వారానికి ఐదు రోజులు విజయవాడలోనే ఉంటానని, అక్కడ రాజధాని నిర్మాణం పనులు పరిశీలిస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని, ఇందులో రెండు రోజుల పాటు జిల్లాల పర్యటనకు వెళ్తానని బాబు చెప్పారు.
రాజధాని విషయంలో సింగపూర్, పుత్రజయ, బీజింగ్, లండన్ ఇలా రకరకాల నమూనాలను పరిశీలిస్తున్నామని, అన్నింటిని కలిపి సొంత నమూనాలో నిర్మిస్తామని, అక్టోబర్ 2వ తేదీ నుండి పించన్లు పెంచుతున్నామని, ఆ రోజు నుండి ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను అమలు చేస్తామని చెప్పారు. వంద రోజుల పాలనను పురస్కరించుకొని సంపాదకులకు బాబు మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. వారితో దాదాపు రెండు గంటలపాటు ముచ్చటించారు.
మంచి ముహూర్తం చూసి రాజధానికి పునాదిరాయి వేస్తామన్నారు. ఓ జోన్ అనుకున్నామని, రైతులు ముందుకొచ్చిన చోట ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు - ప్రభుత్వం రెండూ విజయం సాధించేలా భూసమీకరణ చేస్తామన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు అందరూ ఇళ్ల నిర్మాణాల కోసమూ సమీకరణ పద్ధతిలోనే భూములు తీసుకుంటామని, రైతులు కూడా ఆలోచించాలన్నారు.
తమకు ఇంతే కావాలని కూర్చుంటే ఇబ్బందులు ఉంటాయన్నారు. రాజధాని ఎక్కడనే అంశాన్ని వివాదాస్పదం కాకుండా చూడాలనే అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదన్నారు. అవసరం అనుకుంటే పెడతామని, ఢిల్లీకి మించిన రాజధాని ఏపీకి నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్ని పార్టీల బాధ్యత అన్నారు. పోలవరం ముంపు మండలాలను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించిందన్నారు.
24 గంటల విద్యుత్ పైన మంగళవారం ఒప్పందం జరుగుతుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు కోసం ప్రయత్నం జరుగుతోందన్నారు. విభజన సమయంలో ఏపీకీ ప్రత్యేక హోదాపై ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లేవనెత్తారని గుర్తు చేశారు. ఇటీవల తాను ఆయనను కలిసినప్పుడు ఇదే విషయం చెప్పారన,ి కచ్చితంగా చేసి తీరుతామన్నారని తెలిపారు.
రాయలసీమకు తానే పెద్ద ప్యాకేజీనని చంద్రబాబు చమత్కరించారు. లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ విమర్శల పైన కూడా చంద్రబాబు స్పందించారు. దానిపై తానేమీ మాట్లాడనని, ఏదైనా ఉంటే సాయం చేయాలని, అంతే తప్ప వ్యతిరేక భావాలతో మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికి ఆధార్ అనుసంధానం చేస్తామ్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కలిసి భోజనం చేసేందుకు తాను ఎప్పుడైనా సిద్ధమని చెప్పారు.
ఏపీలో మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్న వివక్ష తనకు లేదన్నారు. హైదరాబాదు పైన గవర్నర్కు అధికారులు ఇచ్చే ప్రక్రియ ఆపలేదని చెప్పారు. ఈ-కేబినెట్ గురించి ప్రశ్నించగా.. ఐటీ ఒక పరికరం మాత్రమేనని, ఆ పరికరాన్ని ఉపయోగించి రైతులకు మేలు చేయడమే తన లక్ష్యమన్నారు.