కేఈ ఫ్యామిలీకి చంద్రబాబు షాక్: డోన్ అభ్యర్థి ప్రకటన; రివర్స్ షాక్ యోచనలో కేఈసోదరులు!!
కర్నూలు జిల్లా రాజకీయాలలో చంద్రబాబు పర్యటన పెను మార్పులను తీసుకు వస్తుందా? గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు ముందస్తుగానే డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం చంద్రబాబుకు తలనొప్పులు తెస్తుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. మొదటి నుండి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం చంద్రబాబు తాజా నిర్ణయంతో పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వెళుతుందేమో అన్న చర్చ జరుగుతుంది.

డోన్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
తాజాగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలో చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో ఒక షాకింగ్ ప్రకటన చేశారు. గతంలో లేని విధంగా కొత్త సాంప్రదాయానికి తెరతీసిన చంద్రబాబు ఈసారి ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే అభ్యర్థిని ప్రకటించారు. డోన్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును బహిరంగసభలో అధికారికంగా ప్రకటించారు చంద్రబాబు.

కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి చంద్రబాబు షాక్
ఇక చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ అనే చెప్పాలి. ఈ క్రమంలోని కేఈ కృష్ణమూర్తి కుటుంబం చంద్రబాబుకు షాక్ ఇస్తూ, పార్టీకి గుడ్ బై చెబుతారు అన్న చర్చ కర్నూలు జిల్లాలో ఆసక్తికరంగా సాగుతుంది. డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి 1985 నుంచి కేఈ కృష్ణ మూర్తి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలోనూ కేఈ ప్రభాకర్ పోటీ చేశారు. డోన్ నియోజకవర్గం నుండి కేఈ ఫ్యామిలీ కి ప్రతిసారీ టికెట్టు ఇస్తూ వస్తున్న చంద్రబాబు ఈసారి కేఈ ఫ్యామిలీ నుంచి కాకుండా సుబ్బారెడ్డి పేరు ప్రకటించడం కర్నూలులో తెలుగు తమ్ముళ్ళను సైతం షాక్ కు గురి చేసింది.

చంద్రబాబు పర్యటనలో కనిపించని కేఈ కుటుంబం .. రీజన్ ఇదే
ఇదిలా ఉంటే తాజాగా కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో కేఈ కుటుంబం నుంచి కూడా ఎవరు పాల్గొనలేదు. చంద్రబాబుకు కేఈ కుటుంబం దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతుంది. గత కొంతకాలంగా డోన్ నియోజకవర్గంలో కేఈ ప్రభాకర్ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సుబ్బారెడ్డిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న కేఈ ప్రభాకర్ అనుచరుల ఈ విషయంలో టీడీపీ అధినాయకత్వం నోటీసులు జారీ చేసి చర్యలకు రెడీ అయింది. ఇక దీంతో కేఈ ఫ్యామిలీ అధినేత చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వారు నిన్న కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో పాల్గొనలేదు.

కర్నూలు రాజకీయాలలో చంద్రబాబు నిర్ణయంతో పెను మార్పులకు ఛాన్స్
దీంతో చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న ధర్మవరం సుబ్బారెడ్డి పేరును డోన్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాదు ఆయారాం గయారాం లకు టికెట్లు ఇవ్వబోనని , పార్టీ కోసం పని చేసే నాయకులకే టికెట్లు అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో కేఈ కృష్ణమూర్తి సోదరులు పార్టీకి రాజీనామా చేస్తారన్న చర్చ స్థానికంగా జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో కర్నూలు జిల్లా రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి కేఈ కృష్ణమూర్తి సోదరులు ఏం చేయబోతున్నారు అనేది త్వరలోనే తెలియనుంది.












Click it and Unblock the Notifications