ఎందుకో: బాబుకు రోజా చురక, కొత్తపల్లి గీతపై ఈశ్వరి
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాసన సభ్యురాలు రోజా బుధవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మలేషియా, సింగపూర్, చైనా పర్యటన ఎందుకు చేస్తున్నారో ఆ పార్టీలోనే స్పష్టత లేదన్నారు.
ప్రజల సమస్యల పైన తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. చంద్రబాబు విదేశీ టూర్లు ఆపేస్తే ప్రజలు సమస్యలు తెలుస్తాయన్నారు. అంగన్వాడీ కార్యకర్తల లాఠీఛార్జ్ ఘటనలో 14 మందిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
టీడీపీ, అరకు ఎంపీ కొత్తపల్లి గీతలు కుమ్మక్కయ్యారని వైసీపీ మరో ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరిపితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, అలా చేస్తే తాము తీవ్ర నిరసన తెలుపుతామన్నారు.
కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని తాము లోకసభ సభాపతికి ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబు, గీతలు గిరిజన ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని ఎస్సీ అని స్క్రూటినీ కమిటీ నివేదిక ఇచ్చినా చంద్రబాబు సర్కార్ ఆ విషయాన్ని బహిరంగం చేయలేదన్నారు.
చంద్రబాబుకు భూముల పిచ్చి పట్టిందని సీపీఐ నేత రామకృష్ణ వేరుగా అన్నారు. జగ్గీ వాసుదేవ్కు 400 ఎకరాల భూములు కేటాయింపు సరికాదన్నారు. చంద్రబాబు రాజధాని పేరుతో గుంటూరులో, విమానాశ్రయం పేరుతో విజయనగరంలో భూములు సేకరించారని మండిపడ్డారు.