చంద్రబాబు విజయ సంకేతం, టీడీపీ శ్రేణుల సంబరాలు, తీవ్ర అసంతృప్తిలో జగన్?
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో... టీడీపీలో సంబరాలు అంబరాన్నంటగా.. అటు వైసీపీలో తీవ్ర అసంతృప్తి, అంతర్మథనం మొదలయ్యాయి.
అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో... టీడీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ఇటు నంద్యాలలోనే కాకుండా, అటు విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, సంబరాలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తన నివాసం వద్ద విక్టరీ సింబల్ ను చూపిస్తూ, ఎన్నికలో విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. 15వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి దాదానె 26 వేల మెజార్టీని సాధించారు.
Recommended Video
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలను పార్టీ ముఖ్యనేతలతో కలసి హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా, ఈ ఎన్నికలో గెలుపు ఖాయమనుకున్న తరుణంలో... ఫలితాలు తీవ్ర నిరాశాజనకంగా రావడంపై జగన్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కినట్టు సమాచారం.
15 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ... సమయం మొత్తాన్ని చంద్రబాబును తిట్టడానికే జగన్ కేటాయించారని, వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు 15వ రౌండ్ లో కూడా టీడీపీ 1442 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.