సింగపూర్ను తలదన్నేలా నెల్లూరు: బాబు, నిలదీసిన రోజా, బొజ్జల తిట్లు!
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను సింగపూర్ను తలదన్నేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. సింగపూర్లో ఒకటే పోర్టు ఉందని, నెల్లూరుకు మాత్రం రెండు పోర్టులు వచ్చే అవకాశముందని చెప్పారు.
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మానసిక వికలాంగులు శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, తావర్చంద్ గెహ్లాట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రతి యువతి కూచిపూడి నృత్యం నేర్చుకోవాలన్నారు.
భవిష్యత్తులో కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. కేంద్రం సహకారంతో ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. సింగపూర్ను తలదన్నేలా నెల్లూరును అభివృద్ధి చేస్తామన్నారు. వెంకయ్య నాయుడు సహకారంతో ఏపీకి ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు.

వికలాంగులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పారు. వికలాంగ ప్రతిభావంతులను ఆదుకుంటామని చెప్పారు. నెల్లూరు, సంగెం బ్యారేజీ పనులు వచ్చే వర్షాకాలానికి పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం రూ.60 కోట్లు మంజూరు చేస్తోందన్నారు.
మానసిక వికలాంగుల గురించి మాట్లాడుతూ... విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిభావంతులకు పెన్షన్ రూ.500 నుంచి రూ.1500కు పెంచామని, అనాధల కోసం 13 హోంలను ప్రారంభిస్తామన్నారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. 50 నగరాల్లో వికలాంగులకు వసతుల కల్పనకు ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి జరుగుతోందన్నారు.
త్వరలో దుగరాజపట్నం పోర్టు విస్తరణ పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్కు ప్రాధాన్యం కల్పిస్తున్న పత్రికలకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. ఏపీకి త్వరలోనే రైల్వేజోన్ మంజూరు కానుందన్నారు.
నిలదీసిన రోజా, బొజ్జల ఆగ్రహం
నగరిలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే రోజా టిడిపి నాయకులను నిలదీశారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైసిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. రోజా, వైసిపి నేతల పైన బొజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రసాభాసగా మారింది. కాగా, బొజ్జల తమ పైన తిట్లతో విరుచుకుపడ్డారని వైసిపి ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications