ఏం మీకు బాధ్యత లేదా, 2గం.లు ఆలోచించు, చూసుకుంటాం!: మోడీకి బాబు
ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం నాడు రాజ్యసభలో బీజేపీ పట్టుబట్టిందని, ఇప్పుడు ఏపీకి ఎందుకు న్యాయం చేయలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని, కేంద్రమంత్రి జైట్లీని, కేంద్రాన్ని ఆదివారం నాడు నిలదీశారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంబంధానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు.
కేంద్రానికి బాధ్యత లేదని ప్రవర్తించడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయమన్నారు. హోదా కోసం బీజేపీ పట్టుబట్టినప్పుడు నిబంధనలు తెలియవా అని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు.
ప్రధాని తలుచుకోకపోవడం వల్లే
ప్రధాని మోడీ తలచుకోకపోవడం వల్లే సమస్యలు అన్నారు. ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఏపీకి అన్యాయం, అవమానం జరిగిందన్నారు. అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీయే పైన ఉందని, తాము అందుకే డిమాండ్ చేస్తున్నామన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలన్నారు.
హోదాను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏ రాష్ట్రానికి లేనన్ని ఇబ్బందులు ఏపీకి ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఏపీకి ఆమోదయోగ్యం కాదన్నారు.
రేపు ఎంపీలు, మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం రెండు కలిసి నష్టాన్ని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి ఎన్నో ఉన్నాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు ఏపీ బాధ్యత కేంద్రానిదే అన్నారు. కేంద్రం అరకొర నిధులు ఇస్తే ఎటూ సరిపోవన్నారు. తొలి ఏడాది లోటు బడ్జెట్ పూర్తి చేస్తామని, ఇప్పటి వరకు చేయలేదన్నారు.
జైట్లీకి కౌంటర్
ఫ్రెండ్లీ స్టేట్ అని చెప్పి ఏపీకి చేయమని జైట్లీ చెప్పడం సరికాదన్నారు. వనరులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారని, వనరులు లేనప్పుడు ఎందుకు విభజించారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు, ఆర్థిక సంఘానికి సంబంధం లేదన్నారు. ఏపీని ఆదుకునే బాధ్యత కేంద్రానిదే అన్నారు.
జగన్ పార్టీకి హితవు
అన్యాయం జరిగిందని చిన్నా, పెద్ద అందరికీ తెలిసిందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మనం కేంద్రం పైన ఫైట్ చేసి, న్యాయం కోసం పోరాడాలన్నారు. కానీ ప్రభుత్వ ఆస్తులను నష్టం చేస్తాం, అభివృద్ధిని అడ్డుకుంటాం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తామని ప్రతిపక్ష వైసిపి చెప్పడం సరికాదన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలో తమ పార్టీ కూడా ఆలోచన చేస్తుందన్నారు. నిరసనలు ఎవరికీ ఇబ్బంది లేకుండా, మనకు న్యాయం జరగేలా ఉండాలన్నారు. అందుకే జపాన్ తరహా నిరసనలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మనం భారత్లో భాగమని, ఎవరికీ మనకు అన్యాయం చేసే హక్కులేదన్నారు.
నేను భయపడుతున్నానా
తాను కేసులకు భయపెడుతున్నానని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. భయపడేందుకు తనకు హైకమాండ్ కూడా లేదన్నారు. ఆ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలకు బాధ్యత ఉందన్నారు. పేపర్ పెడితే, టీవీ పెడితేనో ఓట్లు పడవని, ప్రజలు మెచ్చరని చెప్పారు. నిన్న సమావేశంలో జగన్ నన్ను మాత్రమే తిట్టారన్నారు. తిట్టుకుంటూ పోతే సమస్య పక్కదారి పడుతుందన్నారు.
కనీసం సమయం, సందర్భం లేకుండా మాట్లాడితే ఎలా అన్నారు. ఢిల్లీలో ఏపీకి అన్యాయం చేస్తే, వైసిపి బందులతో ఇక్కడ నష్టం చేస్తారా అని ప్రశ్నించారు. బస్సులు పగులగొడితే మనకే నష్టమన్నారు. ఢిల్లీ పెద్దలు నష్టం చేశారని, మీరు నష్టం చేస్తారా అని వ్యాఖ్యానించారు. నిరసన ఒత్తిడి తెచ్చేలా ఉండాలని, మనకు అన్యాయం జరగవద్దన్నారు.
కట్టుబట్టలతో వచ్చాం.. మోడీకి బాధ్యత లేదా
మనం అన్ని ట్యాక్సులు చెల్లిస్తున్నామని, అలాంటప్పుడు మనకు ఎందుకు అన్యాయం జరగాలన్నారు. గడిచిన యాభై, అరవై ఏళ్లలో ఏపీ ఎన్నో ఇబ్బందులు పడిందన్నారు. ఒకప్పుడు కట్టుబట్టలతో కర్నూలు వచ్చామని, ఇప్పుడు కట్టుబట్టలు, అప్పులతో హైదరాబాద్ నుంచి వచ్చామన్నారు.
ఇలాంటప్పుడు మీకు బాధ్యత లేదా అని కేంద్రాన్ని అడుగుతున్నానని చెప్పారు. ప్రధాని మోడీకి, కేంద్రానికి ఏపీ బాధ్యత లేదన్నారు. ఇలాంటి విభజన ఎప్పుడూ జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు అదనంగా ఖర్చు పెట్టామని చెప్పారు.
నాడు ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాతో పాటు ఎన్నో హామీలు ఇచ్చారని, ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ఇలాంటప్పుడు ఆ ప్రజల ఆశలను వమ్ము చేయవద్దన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం కూడా తగ్గుతోందన్నారు.
ప్రధాని 2 గంటలు ఆలోచిస్తే.., లేదంటే ప్రజలే చూసుకుంటారు
ప్రధాని మోడీ రెండు గంటల పాటు లేదా ఓ రోజు ఓపికగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏం తప్పు చేశామని మాకు అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. మేం ఏం తప్పు చేశామని అన్యాయమని, తప్పు చేయనప్పుడు ఏపీ ఎందుకు అన్యాయానికి గురి కావాలన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలే చూసుకుంటారని ప్రధాని మోడీకి హెచ్చరికలు జారీ చేశారు. ఏపీకి న్యాయం జరగకుంటే మేం ఏం చేయాలో అది చేస్తామని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం హోదాపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాల కలయికే కేంద్రమన్నారు. తాము ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.
కాంగ్రెస్లా ఆడుకోవద్దు
రాజ్యాంగ సవరణ చేయకుండా విభజన చేశారన్నారు. ఏపీకి హోదా జీవన్మరణ సమస్య అన్నారు. ప్రధాని మోడీని తమ పార్టీ ఎంపీలు కలిసి, హోదా ఆవశ్యకతను వివరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విభజనతో ఆడుకున్నట్లు మీరు హోదాతో ఆడుకుంటే అనేక సమస్యలు వస్తాయని, ప్రజలు అన్నీ చూస్తున్నారన్నారు.
రేపు గాంధీ విగ్రహం వద్ద నిరసన
ప్రజలు తన పైన నమ్మకం ఉంచి, గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారని చంద్రబాబు చెప్పారు. కేంద్రంతో పోరాడి విజయం సాధిస్తామని చెప్పారు. రేపు టిడిపి ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతారన్నారు. విభజనతో ఏపీకి అన్యాయం, అవమానం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు.