మీ ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ వస్తే మీకు బాధ రాదా?: చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వ్యాపిస్తోన్న అంటువ్యాధులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగ్యూ వ్యాధితో అనంతపురం జిల్లాలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.
అంటువ్యాధుల నియంత్రణపై శనివారం అమరావతి నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, జిల్లాల యంత్రాంగం, గ్రామ సర్పంచులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రజారోగ్యం క్షీణిస్తోంటే సంబంధిత అధికారులు కట్టుకథలు చెప్పి తప్పించుకోవద్దని ఆయన హెచ్చరించారు. ప్రజలు డెంగ్యూతో బాధపడుతోంటే అధికారులలో చలనం ఉండదా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ వస్తే మీకు బాధ రాదా? అని అధికార యంత్రాగాన్ని నిలధీశారు.
అధికారి హోదాలో ఉన్నవారు తమ ఇంట్లో వ్యక్తులనైనా, ఊరిలో వారినైనా ఒక్కటిగానే చూడాలని అన్నారు. అటువంటప్పుడే ప్రజలు అధికారులు, సిబ్బంది నుంచి మంచి సేవలు అందుకుంటారని హితవు పలికారు. ఇకపై ప్రతి శనివారం ఆరోగ్య దినంగా పాటించాలని చంద్రబాబు ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో ఇద్దరు చిన్నారులు డెంగ్యూతో చనిపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్లక్ష్యం తగదని, ఈ తరహా చర్యలను ఉపేక్షించేది లేదని అనంతపురం నగరపాలక కమిషనర్ ఓబులేశును తీవ్రంగా హెచ్చరించారు. మరోసారి అటువంటి పరిస్థితి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని అన్నారు.
గ్రామాలు, పట్టణాలలో ఎక్కడ మురుగునీరు నిల్వ ఉన్నా బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు సమర్థవంతంగా చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. తాము ఆకస్మిక తనిఖీలు చేసి విధులు సక్రమంగా నిర్వర్తించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రేపటి నుంచి మంత్రులు, కలెక్టర్లు అందరూ ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్య పరచడానికి అధికారులు ముందుకురావాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగు పరిచే చర్యలు, యాంటీ లావా ఆపరేషన్స్ చేపట్టాలని దిశానిర్థేశం చేశారు.