ఉద్యోగాలివ్వరు-ఉన్నవి చేసుకోనివ్వరూ-కోనసీమలో ఇంటర్నెట్ బంద్ పై చంద్రబాబు ఫైర్
కోనసీమలో జిల్లా పేరు మార్పుపై చోటు చేసుకున్న హింస నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. హింస జరిగి వారం రోజులు దాటిపోయినా ఇంకా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించలేదు. దీంతో కోనసీమలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.అయినా పోలీసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
కోనసీమలో ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ స్పందించారు. అమలాపురంలో ఘర్షణలు జరిగి వారం రోజులు దాటిపోయినా ఇంకా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసమర్ధ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. కశ్మీర్ లో వినిపించే ఇంటర్నెట్ సేవల నిలిపివేతను ఇక్కడ వినాల్సి రావడం బాధాకరమని చంద్రబాబు తెలిపారు. ఐటీ వంటి ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం, ఉన్న ఉద్యోగులకు ఇంటర్నెట్ నిలిపేయడం దారుణమన్నారు.
కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే 'ఇంటర్నెట్ సేవలు నిలిపివేత' అనే వార్త ను మన సీమలో వినాల్సి రావడం బాధాకరం.(1/3) pic.twitter.com/oiZCesUOy2
— N Chandrababu Naidu (@ncbn) May 31, 2022

ఇంటర్నెట్ ఇప్పుడు సామాన్యుడి జీవితంలో భాగంగా మారిపోయిందని, చిరు వ్యాపారుల లావాదేవీలు సైతం నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేయడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది లక్షల మందికి సంబంధించిన విషయమని, ప్రభుత్వ ఉదాసీనత వారికి శాపంగా మారకూడదని చంద్రబాబు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications