సభ్యత లేని జగన్కు బుద్ధి చెప్పండి: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాల్చేయండి, ఉరేయండి, బట్టలూడదీయండి, బంగాళాఖాతంలో కలిపేయండి... ఏం మాటలవి! సభ్యత సంస్కారం ఉండొద్దా' అంటూ విరుచుకుపడ్డారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ మానసిక స్థితిపై..
‘నాకు కూడా రాజకీయాల్లో చాలా ఇబ్బందులొచ్చాయి. అలాగని నేనెప్పుడూ సహనం కోల్పోయి మాట్లాడలేదు. సంస్కారం అంటే అలా ఉండాలి. అమెరికాలో మానసిక సమస్యలు ఎక్కువై మానసిక వైద్యులకు డిమాండు పెరుగుతోంది. మన రాష్ట్రంలో కూడా వారికి డిమాండు అధికమవుతోంది' అంటూ జగన్ను ఉద్దేశించి బాబు ఎద్దేవా చేశారు.
Recommended Video
అభివృద్దికి అడ్డు..
‘ప్రజలకు మంచి చేస్తున్నా అడ్డుపడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేని విధంగా ఎంతో బాగా అమలు చేస్తోంటే దానిపైనా విపక్ష నేతలు ఫిర్యాదులు చేసి ఆ నిధులు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు' అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకే రక్షణ లేకుంటే..
జగన్ విద్వేషపూరితమైన వ్యాఖ్యలతో అందరి దృష్టిని అతని వైపునకు తిప్పుకోడానికి ప్రయత్నిస్తూ విచక్షణ కోల్పోతున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రికే రక్షణలేని పరిస్థితులు తీసుకొస్తారా? అని జగన్పై మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవ్యక్తికే రక్షణ లేని పరిస్థితి ఉంటే.. ఇంక ఎవరికి రక్షణ ఉంటుందని చంద్రబాబు ప్రశ్నించారు.
బాబులో వణుకు అందుకే, బంగాళాఖాతంలోనే: నంద్యాల ప్రజలపై జగన్
జగన్కు సంస్కారం నేర్పాల్సిందే..
రాష్ట్రానికి పెద్దగా ఉన్న వ్యక్తినే లెక్క చేయట్లేదంటే ఇంకెవర్ని లెక్క చేస్తారని విపక్ష నేతను విమర్శించారు. అలాంటి నేతకు సంస్కారం నేర్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. ఒకప్పుడు గాలి జనార్దన్రెడ్డి, వైయస్ జగన్లను కూడా కొంతమంది అనుసరించాలని అనుకున్నారని, అయితే చివరకు ఏమైందో అందరికి తెలిసిందేనని చంద్రబాబు అన్నారు. పాలనలో స్థిరత్వం చాలా అవసరమని చంద్రబాబు అన్నారు. ఒక స్థిరమైన విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో తాను, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దిశగా పాలన అందిస్తున్నామన్నారు.
న్యాయపోరాటం.. తెలంగాణకూ నష్టమే..
ఇక కృష్ణా జలాలపై కర్ణాటక అనుసరిస్తున్న విధానంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. చట్టపరంగా మనకు రావాల్సిన కృష్ణా జలాలు మనకు ఇవ్వాలని అన్నారు. కర్ణాటక వైఖరి వల్ల తెలంగాణ కూడా ఇబ్బందులు పడుతోందన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా వంద టీఎంసీల నీళ్లు తెచ్చామన్నారు. గోదావరి జలాలను సోమశిలకు ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్తామన్నారు. రాబోయే మూడు నెలల్లో 28 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.