జగన్ పై పగతో.. ఏపీలో చంద్రబాబు స్లీపర్ సెల్స్.. రోబో సినిమాలోలా డిస్ట్రక్షన్ చిప్!!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయమ్మ గౌరవ అధ్యక్ష పదవికి ప్లీనరీ వేదికగా రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తల్లిని గెంటేసిన వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తారు అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి ఎదురు దాడి చేశారు. చంద్రబాబు కు చిప్ దొబ్బిందని, స్లీపర్ సెల్స్ ను కూడా రంగంలోకి దించాడని ఘాటుగా విరుచుకుపడుతున్నారు.
చంబు నాయుడుకి మైండే కాదు...వినికిడి కూడా దొబ్బింది
లక్షలాది అభిమానుల సాక్షిగా ప్లీనరీలో విజయమ్మగారు చెప్పింది వినిపించలేదా రింగు నాయుడూ? అంటూ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంబు నాయుడుకి మైండే కాదు...వినికిడి కూడా దొబ్బింది అంటూ విజయ సాయి రెడ్డి టార్గెట్ చేశారు. ఈసారి వినికిడి యంత్రం పెట్టుకొని విను, అప్పుడైనా ఆమె ఏం చెప్పిందో వినపడుతుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంపై వ్యామోహంతో సొంత మామనే చంపినోడివి కుటుంబ బంధాలు, ప్రేమలవిలువ నీకెలా తెలుస్తుందిలే! అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
భస్మాసురుడిలా నీ చెయ్యి నీ తల పైనే పడుతుంది
అంతేకాదు చంద్రబాబు జగన్ పై పగ తో రగిలి పోతున్నాడని, తనను ఓడించిన ప్రజలపై కూడా చంద్రబాబు కక్ష కట్టారని వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి రోబో సినిమాలో లాగా చంద్రబాబుకు ఎవరో డిస్ట్రక్షన్ చిప్ తగిలించినట్టు ఉన్నారంటూ విమర్శలు చేశారు. అందుకే విధ్వంసాన్ని వినాశనాన్ని కోరుకుంటున్నావు చంద్రం అంటూ నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న జగన్ పై పగ తో రగిలి పోతున్నావు అంటూ విమర్శలు గుప్పించారు. భస్మాసురుడిలా నీ చెయ్యి నీ తల పైనే పడుతుంది కలియుగ భస్మాసురా అంటూ చంద్రబాబు వినాశనం ఖాయమని విజయ సాయి రెడ్డి తేల్చి చెప్పారు .
ఏదో అరాచకం సృష్టించాలని స్లీపర్ సెల్స్ ను రంగంలోకి దించాడు చంద్రబాబు
అంతేకాదు చంద్రబాబు స్లీపర్ సెల్స్ ను రంగంలోకి దించాడని షాకింగ్ కామెంట్స్ చేసారు విజయసాయిరెడ్డి. హెరిటేజ్ పాలల్లో ఏదైనా కలిపి మద్యం తాగి చనిపోయారని కలరింగ్ ఇచ్చేందుకు పెద్ధ స్కెచ్చే వేస్తున్నట్టున్నాడు నీచుడు చంద్రబాబు అంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. అంతేకాదు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విజయసాయి రెడ్డి సూచించారు.
ఏదో అరాచకం సృష్టించాలని స్లీపర్ సెల్స్ ను రంగంలోకి దించాడు చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు. వెధవపని ఏది చేసినా నీ మెడకే చుట్టుకుంటుందిరా తుప్పూ అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.
వారితో సూటుకేసు, గోనె సంచి కంపెనీలని మొరిగిస్తున్నాడు
ఇక చంద్రబాబు బ్యాంకులను లోన్ ల పేరుతో లూటీ చేసిన వారందరినీ రక్షిస్తాడని, వారిని చంద్రబాబు స్వయంగా ఇతర పార్టీలోకి పంపించి కాపాడుతున్నారని, అందుకే వారు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మొరుగుతున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
రుణాల పేరుతో లక్ష కోట్లు లూటీ చేసిన వారందరికీ రక్షకుడు చంద్రబాబు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరితే ఈగ వాలదో వారందరినీ సెట్ చేసి కాపలా కాస్తున్నాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఎగవేసిన సొత్తులో ఇతనికి కమిషన్లు ముట్టాయి కాబట్టే చంద్రబాబు వారిని రక్షిస్తాడని పేర్కొన్నారు. బ్యాంకుల లూటీ గురించి మాట్లాడకుండా ఇక వారితో సూటుకేసు, గోనె సంచి కంపెనీలని మొరిగిస్తున్నాడు చంద్రబాబు అంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు.