రెబల్స్తో ఢీకే టిఎస్సార్: హరికు డౌట్, వారి వైపు బాబు
వ్యూహాత్మకమేనా?
కాంగ్రెసు పార్టీ కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బి రామి రెడ్డి, ఎంఏ ఖాన్ల పేరు వ్యూహాత్మకంగా ప్రకటించిందని అంటున్నారు. కాంగ్రెసులోని సమైక్యవాదులు కెవిపికి మద్దతు పలుకుతారు. ఇక ఎంఏ ఖాన్కు తెలంగాణ నేతలు మద్దతిస్తారు. అధిష్టానంపై అలక వహించిన సీమాంధ్ర నేతలు పలువురు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకే ఆర్థికపుష్టి కలిగిన టిఎస్సార్ పేరును మూడో అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ ప్రకటించి ఉంటుందని అంటున్నారు.
రెబల్స్గా జెసి, చైతన్య రాజు
కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సిద్ధమైన విషయం తెలిసిందే. రేపటితో రాజ్యసభ నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, చైతన్య రాజులు భేటీ అయ్యారు.
జెసి, చైతన్య రాజులను రాజ్యసభ బరిలో దింపాలని నిర్ణయించారు. మంగళవారం వారు నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. తాను రేపు రాజ్యసభకు నామినేషన్ వేస్తానని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. సమైక్యవాదంపై పోటీ చేస్తున్న తాను గెలుస్తానని చైతన్య రాజు చెప్పారు. కాగా, రేపటి పరిస్థితులను బట్టి చివరకు ఒక్కరినే బరిలో నిలిపే అవకాశాలు కూడా లేకపోలేదు.
హైదరాబాదుకు కుంతియా
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పరిశీలించేందుకు ఏఐసిసి పరిశీలకులు కుంతియా హైదరాబాదుకు వచ్చారు. ఆయన మంగళవారం ఉదయం మంత్రులు, శాసన సభ్యులతో భేటీ కానున్నారు.
కెకె నామినేషన్
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కె కేశవ రావు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కెకెను గెలిపించుకునేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మజ్లిస్ పార్టీని కలిశారు.
నాకొద్దు!
రాజ్యసభ సీటుకు తనను నామినేట్ చేయవద్దంటూ మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాజ్యసభ సీటుకు తనను నామినేట్ చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిజమో? అబద్ధమో? తనకు తెలియదని, తాను ఏటువంటి పదవులు ఆశించి కాంగ్రెస్లో చేరలేదన్నారు. తనపై ఉంచిన విశ్వాసమే అన్నిటి కంటే పెద్ద పదవని, ఇప్పుడు రాజ్యసభ స్ధానాన్ని తీసుకుంటే నిస్వార్ధ కర్యకర్తగా పని చేస్తున్న తాను ప్రజల్లో విశ్వాసం కోల్పోతానని, తన మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళలేనని ఆయన అన్నారు.
హరికృష్ణకు ఛాన్స్ వచ్చేనా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణకు రాజ్యసభ అవకాశం దక్కే అవకాశాలు సగం సగం ఉన్నాయంటున్నారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో పొలిట్ బ్యూరో సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ భేటీకి హాజరైన హరికృష్ణ మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయన సమావేశంలో రాజ్యసభ సీటుకు పట్టుబట్టారు. ఆ తర్వాత బయటకు వెళ్తూ తాను రేసులో ఉన్నానని, కాబట్టి భేటీలో ఉండటం సరికాదనే వెళ్తున్నానని చెప్పారు. హరి అలిగి వెళ్లినా లేక మరేదైనా ఆయన అడిగితే ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబుది అంటున్నారు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మిని హైదరాబాదుకు రావాలని అధిష్టానం కబురు పంపడంతో ఆమె హుటాహుటినా వచ్చారు. ఆమెను రాజ్యసభకు పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కాగా, హరికృష్ణ భేటీ నుండి వెళ్లిపోయాక ఆయన అభ్యర్థిత్వంపై నామమాత్రపు చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. హరికృష్ణకు మరోసారి ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సీతారామలక్ష్మి, గరికపాటిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయని చెబుతున్నారు. అదేవిధంగా మోత్కుపల్లి పేరు పైనా పరిశీలిస్తున్నారు. గరికపాటి, సీతారామలక్ష్మిలకు ఎక్కువ ఛాన్స్ ఉందంటున్నారు. ఆఖరు నిమిషంలో హరికృష్ణ పేరు పరిగణలోకి తీసుకునే అవకాశమున్నా సీటు దక్కడం మాత్రం అనుమానమే అంటున్నారు.