రెండూ: ప్రత్యేక హోదాపై బాబు ప్లాన్! పవన్ కళ్యాణ్ కూడా: పత్తిపాటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, హోదా రెండూ కావాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఆదివారం ప్రకాశం జిల్లాలో అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అదనంగా ఏం అడగడం లేదని, ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నట్లు చెప్పారు.
కేంద్రం బాధ్యత తీసుకొని ఏపీని ఆదుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రజలకు ముఖం చూపించలేని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని, నిందిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25న ప్రధాని మోడీని చంద్రబాబు కలిశాక శుభవార్త వస్తుందన్నారు.
హోదాపై చంద్రబాబు ప్లాన్!
ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. హోదా పైన ప్రభుత్వం వ్యూహాత్మకంగా కదులుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. హోదా కంటే కూడా ప్యాకేజీ పైనే ముందుగా పట్టుబట్టాలని టిడిపి భావిస్తోందని తెలుస్తోంది.
ఇలా వ్యవహరిస్తేనే రాష్ట్రానికి మరింత న్యాయం జరుగుతుందని భావిస్తోందంటున్నారు. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ పైన చర్చించనున్నారు. కీలకమైన ఈ భేటీలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేసుకున్నారంటున్నారు.
ముందుగా ప్యాకేజీ కోసం పట్టుబట్టి, అనుకున్న మేర నిధులు సాధించుకున్న తర్వాతే హోదా పైన మాట్లాడాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు నివేదిక సిద్ధం చేశారని తెలుస్తోంది. ప్యాకేజీ తర్వాత హోదా కోసం కూడగట్టనున్నారని తెలుస్తోంది.
చంద్రబాబు రూ.25 వేల నుంచి రూ.40వేల కోట్ల మేర సహాయాన్ని ప్యాకేజీకో రనున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోడీ నుంచి హామీ లభించాక.. ప్రత్యేక హోదా పైన గళం విప్పనున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కూడా: పత్తిపాటి
తాము అధికారంలోకి రావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దోహదపడ్డారని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయనతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కోసం చివరి ప్రయత్నంగానే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తున్నామన్నారు.
ఇప్పటికీ తాము భూసమీకరణకే మొగ్గుచూపుతున్నామని, ఈ విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో రైతులనే కాక పవన్ కళ్యాణ్ను కూడా ఒప్పిస్తామన్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య భేటీ ఏర్పాటు చేస్తామన్నారు.