Kakinada Port: పవన్ ఆరోపణలపై చంద్రబాబు మౌనం-కాకినాడ ఎమ్మెల్యే పాత్రపై చర్చ..!
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సులువైన మార్గంగా మారిన కాకినాడ పోర్టులో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాకినాడ పోర్టులోకి వివిధ కారణాలతో తనను రానివ్వకుండా రెండు నెలలు అధికారులే అడ్డుకున్నారని, చివరికి పోర్టులోకి వచ్చినా షిప్ లోకి ఎక్కనివ్వకుండా సాకులు చెప్పారని పవన్ చేసిన ఆరోపణలు, కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే మౌనాన్ని ప్రశ్నించిన తీరు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యమే కాదు డ్రగ్స్, పేలుడు పదార్ధాలు కూడా అక్రమ రవాణా అయ్యే అవకాశం ఉందని, కసబ్ లాంటి ఉగ్రవాదులు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని, పోర్టు భద్రతపై అమిత్ షాకు లేఖ రాస్తానని పవన్ నిన్న హుంకరించారు. అయితే దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని అంతా భావించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించలేదు.

గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు నేరుగా ప్రభుత్వ పెద్దల్ని తాకాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి చుక్కలు చూపించిన ప్రభుత్వం.. ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో పవన్ చేసిన ఆరోపణలపై మాత్రం మౌనంగా ఉండటం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఇంత జరుగుతున్నా స్దానిక టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ వేసిన ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వాన్ని తాకినట్లు కనిపిస్తోంది.
కాకినాడ పోర్టులో భారీ ఎత్తున అక్రమ బియ్యం విదేశాలకు రవాణా కావడం, డిప్యూటీ సీఎం స్ధాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ నే అడ్డుకున్న తీరు, పవన్ వచ్చినప్పుడల్లా జిల్లా ఎస్పీ అందుబాటులో లేకుండా సెలవుపై వెళ్లిపోవడం వంటి కారణాలు చూస్తుంటే అక్కడ ఏదో జరుగుతోందన్న భావన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. అదే సమయంలో కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలకు తెలియకుండా పోర్టులో ఏదో జరిగే అవకాశాలు అస్సలు లేవు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై వెంటనే స్పందిస్తే ఇబ్బందులు తప్పవన్న భావనతో చంద్రబాబు మౌనంగా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications