కడపపై చంద్రబాబు స్కెచ్: జగన్కు సొంత ఇలాకాలో చెక్ చెప్పేందుకు..
కడప: ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం అప్పడే ఎన్నికలు వచ్చినట్లుగా హడావుడి కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు లోకసభ నియోజకవర్గాలకు మంత్రులను ఇంచార్జులుగా నియమించారు.
చంద్రబాబు ప్రధానంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా కడప పైన దృష్టి సారించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.
లోకసభ నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించిన చంద్రబాబు కడప పార్లమెంటు ఇంచార్జిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నియమించారు. రాజంపేట పార్లమెంటు ఇంచార్జిగా ఆదినారాయణ రెడ్డిని నియమించారు. వీరిద్దరు ఇప్పటికే తమ పనిని ప్రారంభించారు.
రంగంలోకి దిగిన సోమిరెడ్డి, ఆదినారాయణ
వారు నియోజకవర్గాలవారీగా స్థానిక నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. అన్ని నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టిడిపి కేవలం ఒక సీటును మాత్రమే గెలిచింది.
టిడిపి బలోపేతం..
ఆ తర్వాత ఇద్దరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. దీంతో టిడిపి కడప జిల్లాలో బలపడింది. ఆ తర్వాత ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డిని బీటెక్ రవి ఓడించారు.
చంద్రబాబు పావులు
వైసిపి కంచుకొటను మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి బద్దలు కొట్టింది. ఈ జోష్తో కడపలో వచ్చే ఎన్నికల్లో టిడిపి జెండా ఎగురవేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు.
వ్యూహాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి గెలుపుకు జిల్లా టిడిపి నేతలతో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు వ్యూహరచనలు చేశారు. వారు జిల్లాలో మకాం వేసి బీటెక్ రవి గెలుపు కోసం కృషి చేశారు.
వ్యూహాత్మకంగా బాధ్యతల అప్పగింత
ఇక, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి వంటి జిల్లా నేతల కృషి కూడా ఉంది. బీటెక్ రవి గెలుపులో తన వంతు పాత్ర పోషించిన సోమిరెడ్డికి చంద్రబాబు కడప పార్లమెంటు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక, జిల్లాకు చెందిన ఆదినారాయణకు రాజంపేట బాధ్యతలు అప్పగించారు.