ప్రత్యేక హోదాపై బిల్లు: చంద్రబాబు వ్యూహం ఏమిటి?
విజయవాడ: తెగేదాకా లాగకుండానే బిజెపిని చిక్కుల్లో పడేసే వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాజ్యసభలో ప్రత్యేకహోదాపై కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన బిల్లుకు మద్దతు ఇవ్వడం వెనక వ్యూహం అదేనని అంటున్నారు. ఓ వైపు ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతూనే బిజెపితో నెయ్యం కొనసాగేలా ఆయన వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.
విభజన హామీల అమలు విషయంలో తాము రాజీ పడడం లేదని, పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలకు సంకేతాలు ఇవ్వడమే చంద్రబాబు ఉద్దేశమని చెబుతున్నారు. ఈ మేరకు టిడిపి పార్లమెంటు సభ్యులకు ఆయన గురువారంనాడు తన ఉద్దేశాన్ని, వ్యూహాన్ని వివరించి చెప్పినట్లు సమాచారం.
రాష్ట్రాన్ని కాంగ్రెసు విభజించినప్పటికీ అందులో బిజెపి కూడా పాలు పంచుకుందని, పైగా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాల్సింది బిజెపియేనని ఆయన భావిస్తున్నారు. తాము కేంద్ర ప్రభుత్వంలో పాలు పంచుకున్నప్పటికీ తమ మనోభావాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని, ఎపికి చేయాల్సినంత సాయం కేంద్రం చేయడం లేదని ఆయన భావిస్తన్నారు.

రెండేళ్లు పూర్తయినా గానీ విభజన హామీలు అమలు కావడం లేదని, ఈ స్థితిలో ప్రజల్లో అసహనం పెరిగిందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన ఎంపీలకు చెప్పారు. హైకోర్టు విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కూడా చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో విడిగా హైకోర్టును ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఆయనకు మింగుడు పడడం లేదని అంటన్నారు.
సమస్యల పరిష్కారానికి బిజెపితో తాము పోరాడుతున్న సంకేతాలను ప్రజల్లోకి పంపించడమే ప్రస్తుతం మన ముందున్న ప్రత్యామ్నాయమని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం పట్ల పార్టీ పార్లమెంటు సభ్యుల్లో తీవ్రమైన ఆసంతృప్తి ఉంది. దాన్ని చల్లార్చడంలో చంద్రబాబు విజయం సాధించారనే మాట వినిపిస్తోంది. బిజెపిపై వీధికెక్కి పోరాటం చేయడానికి ఇంకా కొంత సమయం ఉందని చంద్రబాబు పార్లమెంటు సభ్యులకు చెప్పినట్లు సమాచారం. మొత్తంగా బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరనే విషయం అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications