కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దు, జెసి మాట తప్పొద్దు: చంద్రబాబు
హైదరాబాద్: విభజన చట్టంలో హామీల అమలుకు కృషి చేయాలని, కాంగ్రెస్ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే బిల్లు రూపకల్పన సమయంలోనే రెండు రాష్ట్రాలకు న్యాయం చేసి ఉండేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో అన్నారు. కేంద్రం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉందని, వాళ్లకంటే మన పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులకు చెప్పారు.
రైల్వే జోన్కు సంబంధించి కూడా పరిశీలించాలని మాత్రమే చట్టంలో పెట్టారు తప్ప కచ్చితంగా ఏర్పాటు చేయాలని చట్టంలో పెట్టలేదని ఆయన అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎపికి ప్రత్యేక హోదా, ఆర్థికలోటు, ఎన్నికల హామీలను పార్లమెంట్ సభ్యులతో చర్చించారు.
పాలనను ఏపీకి మారుద్దామంటే ఉద్యోగులు వెంటనే వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు ఎంపిలతో చెప్పారు. ఏపీకి రమ్మంటే ఇళ్లు నిర్మించాలని అడుగుతున్నారని, 20 వేల గృహాలు వెంటనే నిర్మించి ఇవ్వడం కష్టమని ఆయన అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని కేంద్రమే హామీ ఇచ్చిందని, రాజధానికి కేంద్రం ఇస్తామంటున్న సాయం సరిపోదని, రూ. 5 వేల కోట్లు ఏ మూలకూ చాలవని చంద్రబాబు ఎంపీలతో అన్నారు.

బడ్జెట్లో 9 వేల కోట్ల రూపాయలు వస్తాయని, ఎంపీలు ఇస్తామన్న 24 కోట్ల రూపాయలు ఇస్తే హుదుద్ తుఫాను బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే, తన నిధులను అనంతపురం జిల్లాలో మంచినీటి సౌకర్యం కోసం ఖర్చు చేస్తామని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అన్నారు. మాట ఇచ్చినందుకు విరాళం ఇవ్వాలని చంద్రబాబు జెసితో అన్నారు.
చంద్రబాబుతో సమావేశం ముగిసిన తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వారు వ్యాఖ్యానించారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని వారు చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications