టిడిపి నుంచి వాకాటి సస్పెన్షన్: ఆ డబ్బు వారి చేతుల్లోకి.. మోడీకి మళ్లీ బాబు ఝలక్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
చదవండి: అమెరికాలో నన్ను పక్కకు లాగి పడేశారు: షాకైన చంద్రబాబు
వాకాటికి చెందిన సంస్థలపై సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించామని, ఆయన నిర్దోషిగా నిరూపితమైతే అప్పుడు మళ్లీ పార్టీలోకి తీసుకుంటామన్నారు.
తప్పు చేస్తే అంతే...
దేనికైనా ఓ పద్ధతి ఉండాలని, పార్టీలో ఎవరు తప్పు చేసినా సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు. కాగా, వాకాటి కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు.
రూ.2000 నోట్లు రద్దు చేయాలని మోడీకి..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి షాకిచ్చారు. రూ.2000 నోట్లు రద్దు చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. విశాఖలో రూ.1379 కోట్ల స్కాం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి బాబు ఈ డిమాండ్ చేస్తున్నారు.
అవినీతిని అరికట్టాలంటే
గతంలో రూ.వెయ్యి, 500 నోట్లను రద్దు చేయాలని కోరామని, ఇప్పుడు రెండు వేల నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నామని చంద్రబాబు అన్నారు. అవినీతిని అరికట్టాలన్నా అవినీతిపరులను బయటకు లాగాలన్నా అదే మార్గమని వ్యాఖ్యానించారు.
విశాఖ స్కాంపై తీవ్రంగా
విశాఖపట్నానికి వెలుగు చూసిన హవాలా వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అవినీతిపరులు స్వేచ్ఛగా చలామణి అవుతుండటంతో.. అలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని ఇలాంటి వారు చెలరేగిపోతున్నారన్నారు.
సూట్కే్సల కంపెనీలు పెట్టి రూ.1369 కోట్లు దోచుకుంటున్నారంటే ఏమిచేస్తే తనకేమవుతుందనే లెక్కలేని తనం ఎక్కువైందన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆ డబ్బంతా అవినీతిపరుల చేతికి
నోట్ల రద్దు సమయంలో రాష్ట్రంలో నగదు కొరత రాకుండా తగినంత డబ్బు పంపుతున్నామని ఆర్బీఐ చెబుతూ వచ్చిందని, కానీ ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదని చంద్రబాబు అన్నారు. ఆ డబ్బంతా ఇలాంటి అవినీతిపరుల వద్దకే చేరిందని ఇప్పుడు తెలుస్తోందన్నారు.