మోడీ నన్నూ మోసం చేశారు, ఇడ్లీపైనా టాక్సా?: చంద్రబాబు ఎద్దేవా
అమరావతి: ఇంటి పెద్ద హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఎలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందో తనకు తెలుసని, అందుకే చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రన్న బీమా మూడో ఏడాది కార్యక్రమాన్ని చంద్రబాబు వుక్రవారం ప్రారంభించారు.
2016లో 2.13కోట్ల మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2.5కోట్ల మందితో దేశంలోనే అతిపెద్ద బీమా పథకంగా గుర్తింపు పొందింది. రెండేళ్లలో 1.50 లక్షల కుటుంబాలకు రూ.2వేల కోట్ల బీమా చెల్లించారు.

అందుకే చంద్రన్న బీమా తెచ్చా..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పాదయాత్రలో తాను చూసిన సంఘటనల నుంచే చంద్రన్న బీమా ఆలోచన పుట్టిందని తెలిపారు. ‘లారీ డ్రైవర్లు దూర ప్రాంతాలకు వెళ్లి వారం పది రోజుల వరకు తిరిగిరారు. అలాంటి వారు ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. అందుకే చంద్రన్న బీమా పథకాన్ని వారికీ వర్తింపచేయాలని అనుకున్నాం. దీన్ని మొదట్లో చాలామంది వ్యతిరేకించారు. వాటిని పట్టించుకోకుండా డ్రైవర్లకు బీమాను వర్తింపచేస్తున్నాం' అని తెలిపారు.

ప్రజల సంతోషం కోసమే..
‘ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత 11వ రోజే పరిహారాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం' అని చంద్రబాబు తెలిపారు. చంద్రన్న బీమా పథకం సక్రమంగా అమలు చేయడానికి డ్వాక్రా సంఘాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్మికశాఖ కమిషనర్ వర ప్రసాద్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్ను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

మోడీ నన్నూ మోసం చేశారు
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అందరినీ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మాటలకు తానూ మోసపోయానని ఆయన అన్నారు. ప్రధాని మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. అనుభవంలేని వాళ్ళు నేనే పాలిస్తా అంటూ రోడ్డు ఎక్కారని చెప్పుకొచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మోడీ మైక్ తీసుకుంటే..
ఏటీఎంలలో డబ్బులులేని పాలన దేశంలో సాగుతోందని వ్యాఖ్యానించారు. మన డబ్బులు మనం తీసుకోవాలంటే క్యూలో నిలబడేలా చేశారని చంద్రబాబు అన్నారు. ఇడ్లీపై కూడా 18శాతం టాక్స్ వేస్తారా, ఇది దారుణమని అన్నారు. ప్రధానమంత్రి మైక్ తీసుకుంటే.. ఎవరూ ఆయనను ఆపలేరని, ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘మా ప్రభుత్వం ఎన్నో చేస్తోంది. వేరే వారి మాటలు నమ్మకండి. నేను వేసిన రోడ్ల మీదే నడుస్తూ.. నన్నే విమర్శిస్తున్నారు' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications