అఖిలప్రియకు 'సర్వే' షాక్, టిక్కెట్పై తేల్చేసిన బాబు: ఇష్టం లేకుంటే వెళ్లిపోండి.. వారికి అధినేత
అమరావతి: ఎన్నికల నాటికి సర్వేలో ఎవరికి బాగుంటే వారికి టిక్కెట్ ఇస్తామని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిలకు శుక్రవారం తేల్చి చెప్పారు. అఖిల-ఏవీల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తగా, చంద్రబాబు వారిని పిలిపించి రాజీ కుదిర్చిన విషయం తెలిసిందే.
Recommended Video
చదవండి: టీ కప్పులో తుఫాను, పాత వ్యక్తులేనని సీఎం చెప్పారు: అఖిల- ఏవీ సుబ్బారెడ్డి కలిశారు!
ఈ సందర్భంగా టిక్కెట్ విషయంలో తేల్చేశారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో సర్వే చేయిస్తున్నానని, ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటే వారికే ఇస్తామని, అప్పుటి వరకు ఇద్దరు కలిసి పని చేయాలని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల-ఏవీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
చదవండి: కూతురుతో విమర్శలా.. ఫిర్యాదు: అఖిలకు బాబు క్లాస్! ఏవీ అసంతృప్తి వెనుక ఇదీ విషయం!!
సర్వేతో టిక్కెట్.. అఖిలప్రియకు ఝలక్!
ఏవీ సుబ్బారెడ్డి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ సర్వేలో ఎవరికి బాగుంటే వారికి టిక్కెట్లు ఇస్తామని అధినేత చెప్పడం అఖిలకు షాక్ అని అంటున్నారు. సాధారణంగా సిట్టింగులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇటు అఖిలప్రియకు, అటు ఏవీకి కేడర్ ఉంది.
పట్టు ఎవరికి ఉంటే వారిదే టిక్కెట్
గతంలో భూమా నాగిరెడ్డితో కలిసి ఏవీ సుబ్బారెడ్డి పని చేశారు. ఇప్పుడు అదే కేడర్ రెండుగా విడిపోయిందని అంటున్నారు. అఖిలప్రియతో పాటు ఏవీకు కూడా పట్టుంది. ఈ నేపథ్యంలో సర్వే ఆధారంగా టిక్కెట్ ఇస్తామని చెప్పడం గమనార్హం. ఆళ్లగడ్డ, నంద్యాలలో తమకు మంచి బలం ఉందని భూమా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తలనొప్పులు తేకండి
పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని, కలిసి పని చేయాలని, తాను ఎప్పటికి అప్పుడు సర్వేలు చేయిస్తున్నానని, గొడవలు లేకుండా ఐకమత్యంగా ముందుకు నడవాలని, తనకు కొత్త కొత్త తలనొప్పులు తీసుకు రావొద్దని చంద్రబాబు ఇరువురు నేతలకు సూచించారని తెలుస్తోంది. పార్టీలో అందరు కలుపుకొని పోవడానికి బదులు తగాదాలు ఏమిటని అన్నారు.
వింటే మీ ఇష్టం లేదంటే.. తల్లిదండ్రులకు రాని అవకాశం
మంత్రి అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డిని కూడా చంద్రబాబు గట్టిగానే మందలించారనే ప్రచారం కూడా సాగుతోంది. నీకు ఏదో ఒక అవకాశమివ్వాలనుకున్నానని, కానీ తొందరపాటు చర్యలతో తగాదాలు తెచ్చుకుంటున్నారని, వింటే బాగుపడతారు లేదంటే మీ ఇష్టమని ఏవీ సుబ్బారెడ్డితో అన్నారట. అందరితో తగాదాలు ఏమిటని అఖిలప్రియను ప్రశ్నించారట. మీ అమ్మకు, నాన్నకు రాని అవకాశం వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విభేదాలు మధ్యవర్తితో పరిష్కరించుకోవాలని, వేదికలపైకి రావొద్దన్నారు. మీ ఇద్దరికి ఆమోదయోగ్యుడైన రామకృష్ణా రెడ్డితో పరిష్కరించుకోవాలన్నారు.
ఇష్టం లేకుంటే వెళ్లిపోండి
ఆళ్లగడ్డతో పాటు చింతలపూడి నియోజకవర్గం విషయంలోను నేతలకు అంతకుముందు రోజు క్లాస్ పీకారట. ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబులు వర్గాలుగా విడిపోవడం, తరుచూ గొడవ పడటం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వాయిదా పడుతుండటంపై అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఓ సమయంలో నేను చెప్పింది నచ్చకుంటే బయటకు వెళ్లిపోండి, నాకేమీ అభ్యంతరం లేదని కూడా నేతలతతో చెప్పారట.