గంటా వ్యవహారంపై తాడోపేడో- రేపు రావాలని చంద్రబాబు మెసేజ్-ఏదో ఒకటి తేల్చేస్తారా ?
ఏపీలో 2019 ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన గంటా శ్రీనివాసరావు.. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. టీడీపీ వ్యవహారాల్లో కానీ, అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన టీడీపీ ఎమ్మెల్యే అన్న విషయాన్ని అంతా మర్చిపోయారు. కానీ టీడీపీ మాత్రం అధికారికంగా ఇంకా తమ లెక్కల్లో ఆయన్ను ఎమ్మెల్యేగానే పరిగణిస్తోంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్న టీడీపీ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఏదో ఒకటి తేల్చేయాలనే ఆలోచనలో ఉంది.

గంటా శ్రీనివాస్ వ్యవహారం
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్దితి. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా చాలా యాక్టివ్ గా ఉండే గంటా.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీకి క్రమంగా దూరమవుతూ వచ్చారు. వైసీపీ తనను టార్గెట్ చేస్తుందన్న భయమో, తన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందనే ఆందోళనతో తెలియదు కానీ టీడీపీకి మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో ఇన్నాళ్లూ వేచి చూసిన టీడీపీ ఇక ఆయన వ్యవహారంపై దృష్టిసారిస్తోంది.

వైసీపీలో చేరికపై మల్లగుల్లాలు
టీడీపీ నుంచి గెలిచినా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి ఆ పార్టీ నేతలు ఎప్పుడో ఆహ్వానించారు. కానీ ఆయన పార్టీలో చేరేందుకు కొన్ని కండీషన్లు పెట్టారన్న ప్రచారం జరిగింది. అయితే ఒకప్పటి ఆయన శిష్యుడు, ప్రస్తుత వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ నుంచి అభ్యంతరాల నేపథ్యంలోనే వైసీపీలో గంటా చేరిక వాయిదా పడుతూ వస్తోందన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ వైసీపీలో ఆయన చేరతారో లేదో విశాఖలో సైతం ఎవరూ చెప్పలేని పరిస్ధితి.

విశాఖ స్టీల్ ప్లాంట్ పోరులోకి
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ పోరులోకి అడుగుపెట్టిన గంటా శ్రీనివాస్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ స్పీకర్ తమ్మినేనికి లేఖ పంపించారు. అయితే ఆ లేఖపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పోరులో మైలేజ్ తెచ్చుకున్న గంటాను వైసీపీలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందని భావిస్తున్న కీలక నేతలు.. ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరితే జనంలో పలుచన అవుతానన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

తాడోపేడో తేల్చేయనున్న చంద్రబాబు
టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, మధ్యలో వైసీపీలోకి వెళ్తారంటూ లీకులు ఇస్తూ కాలం గడిపేస్తున్న గంటా శ్రీనివాస్ వల్ల ఇక తమకు ఉపయోగం లేదని అంచనాకు వచ్చేసిన అధినేత చంద్రబాబు.. ఇక ఆయన వ్యవహారాన్ని తేల్చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రేపు గంటాతో సహా పార్టీలో 12 మంది ఇలాంటి నేతల వ్యవహారాన్ని తేల్చేందుకు ఆహ్వానాలు పంపారు. రేపు చంద్రబాబుతో భేటీకి గంటా హాజరయ్యే అవకాశముంది. ఈ భేటీలో ఆయన టీడీపీలో కొనసాగుతారా లేదా అనే అంశంపై చంద్రబాబు క్లారిటీ తీసుకోనున్నారు. గంటా టీడీపీలో కొనసాగకపోతే మాత్రం మరో ఇన్ ఛార్జ్ ను నియమించే అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications