బాబు బ్లాక్మెయిల్ యత్నం: బొత్స, ఐప్యాడ్పై కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ధ్వజమెత్తారు. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు అందుకు తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఎంసెట్ కౌన్సెలింగ్, ఫీజు రీయింబర్సుమెంట్స అన్ని కూడా విభజన చట్టం ప్రకారమే జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంలో గవర్నర్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఐ ప్యాడ్ ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. వరికి కేంద్రం రూ.50 మాత్రమే మద్దతు ప్రకటించినప్పుడు పెంచమని ఎందుకు అడగలేదన్నారు. జలయజ్ఞంలో తప్పులు జరిగాయని చెబుతున్న చంద్రబాబు.. ఎక్కడ జరిగాయో విచారణ జరిపించాలన్నారు.
ఆత్మహత్యలు వద్దు: పోచారం
రైతుల ఆత్మహత్యలన్నీ తెలుగుదేశం, కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని టీఎస్ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వేరుగా అన్నారు. తెరాస ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామని చెప్పారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు.
ఫాస్ట్ విధివిధానాల రూపకల్పనకు కమిటీ
ఫాస్ట్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 1956కు ముందు తెలంగాణలో నివసించిన వారే అర్హులని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ-ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ శాఖ జారీ చేస్తుందని ఉత్తర్వులో వెల్లడించింది. ఫాస్ట్ పథకానికి విధివిధానాలు రూపొందించేందుకు ఐదుగురు అధికారుల బృందంతో ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.