హాట్ టాపిక్ గా మారిన చంద్రబాబు-ఉండవల్లి భేటీ:ఈ సమావేశం వెనుక కారణాలు ఇవేనా?
అమరావతి:సిఎం చంద్రబాబుపై ఒంటికాలితో లేచే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ సోమవారం అదే చంద్రబాబుతో భేటీ కావడం ఎపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video
ఈ సమావేశం గురించి వినగానే చాలామంది అబద్దమేమో అనుకున్నారు...నమ్మలేకపోయారు. అయితే ఉండవల్లి తన అనుచరులతో కలసి అమరావతికి వచ్చి సీఎంవోలో నేరుగా సీఎంను కలిసి ముచ్చటించడంతో ఇక ఈ భేటీ చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఈ భేటీ వెనుక ముఖ్య ఉద్దేశ్యమేమిటి?...ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయి? ...అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది...అయితే ఆ కారణాలు ఇవేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆది నుంచి...అదే వాదన
మాజీ ఎంపి ఉండవల్లి ఆరంభంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి కూడా వివరాలు అందజేశారు. అది జరిగిపోయిన అనంతరం ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి...దాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎంపీలకు ఉండవల్లి అనేక సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదేక్రమంలో కేంద్రం నుంచి ఏపీకి జరగాల్సిన న్యాయం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు ఉండవల్లి. ఇటీవల ఇదే విషయమై మాట్లాడుతూ...రాష్ట్ర విభజన సరిగా జరగలేదనేందుకు ఆధారాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు టీడీపీకి ఇస్తానని, వారు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నోటీసులు ఇవ్వాలని, వారు కాదంటే నేను ఇతర రాష్ట్రాల పార్టీలకు వాటిని ఇచ్చి పోరాడమని కోరుతానని చెప్పారు.
ఆ క్రమంలోనే...సిఎం చంద్రబాబుకు లేఖ
విభజన సక్రమంగా జరగలేదనే విషయంపై ప్రధాని మోదీ కూడా ఒకసారి సభలో మాట్లాడారని, మరి ఈ అంశం మీద చర్చను కోరుతూ లోక్సభలో నోటీస్ ఇవ్వాలని సూచిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక లేఖరాశారు. గతంలో కూడా ఇదే విషయమై ఒక లేఖ రాసినా అప్పుడు సిఎం చంద్రబాబు స్పందించలేదు. తన లేఖపై స్పందిస్తే.. రాష్ట్రానికి మేలు జరుగుతుందని, కనీసం దేశ వ్యాప్తంగా చర్చ అయినా జరుగుతుందని ఆయన తన లేఖలో సూచించారట. అయితే ఉండవల్లి సూచన నచ్చిందో లేక మారిన పరిస్థితుల ప్రభావమో ఏమో కాని తాజా లేఖపై సిఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిసింది.
ఉండవల్లికి...సిఎం ఆహ్వానం
ఈ లేఖను చదివిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఒకసారి కలవాల్సిందిగా ఉండవల్లికి ఆహ్వానం పంపవలసిందిగా సిఎంవో సిబ్బందికి సూచించారట. దీంతో సీఎంవో అధికారైన పెండ్యాల శ్రీనివాసరావు ఉండవల్లికి సీఎం ఆహ్వానం గురించి సందేశాన్ని ఒక మెస్సేజ్ రూపంలో ఉండవల్లికి పంపించారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్కుమార్, తన అనుచరులు అల్లు బాబి తదితరులతో కలిసి సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసి భేటీ అయ్యారు.
సమావేశం...జరిగింది ఇలా
సిఎం చంద్రబాబు-ఉండవల్లి మధ్య జరిగిన సమావేశంలో రాష్ట విభజన సక్రమంగా జరగకపోవడం, ఆరోజు తలుపులు మూసివేసి నిబంధనలు పాటించకుండా కనీసం తలలు కూడా లెక్కపెట్టకండా విభజించిన విషయంతో సహా ఇదే విషయానికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అప్పుడు టీవీ లైవ్లు లేకపోయినా, తలుపులు మూసేసివున్నా ఆరోజు సభలో జరిగే ప్రతీ అంశం రికార్డు అవుతుందని, వాటిని తాను సేకరించి ఒక బుక్గా కూడా వేశానని ఉండవల్లి ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు వివరించారట. ఈ సమావేశం అనంతరం తాను ఈ లేఖలోని అంశాలపై పార్టీ వర్గాలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానని సీఎం తనతో చెప్పారని ఉండవల్లి తెలిపారు. దీంతో సిఎం చంద్రబాబు-ఉండవల్లి భేటీకి దారితీసిన పరిస్థితుల ఇవేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.