రూ.500 కోట్లు ఇస్తే ఏంటో చూపిస్తా: బాబు అసహనం, మరో తీపి కబురు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణమాఫీ పైన తీపి కబురు చెప్పారు. ఈ రోజు ఆయన విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రెండో విడత రుణమాఫీ నిధులను ఈ నెల 22వ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
రూ.3,500 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. నగదు తీసుకోకుండా ఖాతాలోనే ఉంచితే 10 శాతం వడ్డీ చెల్లిస్తామని, ఆ నిధులను మూడో విడత రుణమాఫీ కావాలనుకున్న వారికి చెల్లిస్తామన్నారు. 170 ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు నిర్మిస్తామని, గ్రామాల్లో ప్రభుత్వ ఆస్తులను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు బ్యాంకర్ల పైన అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఒక రంగానికి కేటాయించిన నిధులను మరో రంగానికి తరలించడం సరికాదని బ్యాంకర్లకు సూచించారు. లెక్కల్లో కేటాయింపులు ఆచరణలో కనిపించడం లేదన్నారు.
స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టు రిపోర్టు కోసం నాబార్డు ఖర్చు చేస్తున్న 500 కోట్ల వల్ల ఉపయోగం లేదన్నారు. రూ.500 కోట్లు రాష్ట్రానికి ఇస్తే స్మార్ట్ విలేజ్ అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు. వచ్చే మూడోళ్లలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు, వ్యవసాయానికి నీటి ఇబ్బందులు లేవని, వ్యవసాయ రంగానికి అధికంగా రుణాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులను చంద్రబాబు కోరారు.
చంద్రబాబు గూగుల్ ఇండియా ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. 170 ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు నిర్మిస్తామని, గ్రామాల్లో ప్రభుత్వ ఆస్తులను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. టూరిజం ఆన్ లైన్ ప్రమోషన్ అంశంపై చర్చించారు. జియో ట్యాగింగుకు ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలు వినియోగిస్తామన్నారు.