మంత్రుల వల్లే ఓటమి, ఇక మీరెందుకు: వైసిపి గెలుపుపై బాబు సీరియస్, హెచ్చరిక
గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గుంటూరు జిల్లా నేతలతో ఆయన గురువారం సమావేశమయ్యారు.
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గుంటూరు జిల్లా నేతలతో ఆయన గురువారం సమావేశమయ్యారు.
ఏ చిన్న ఎన్నికైనా సరే చాలా సీరియస్గా తీసుకుంటానని ఆయన వారికి తెలిపారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే ఓటమిపాలయ్యామన్నారు. జిల్లా సమీక్ష నిర్వహించి లక్ష్యాలు నిర్దేశించినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు వేల ఓట్లున్న వార్డులోనే పార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోతే మీరంతా ఎందుకని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

ఎవరు పని చేయలేదో చెప్పండి
క్షేత్రస్థాయిలో ఎవరు పని చేయలేదో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.

వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయని బాధ్యులపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. నియోజకవర్గ ఇంచార్జిలతో పాటు జిల్లా పార్టీ నేతల పైన కూడా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికల్లో టిడిపికి షాక్
కాగా, రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మున్సిపాలిటీ ఉప ఎన్నికలో అధికార టీడీపీకి షాక్ తగిలిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి రాజీనామాతో ఈ మున్సిపాలిటీలోని 31వ వార్డుకు ఉప ఎన్నిక జరిగింది.

వైసిపి గెలుపు
వ్యక్తిగత కారణాలతో టీడీపీ అభ్యర్థి మురళీకృష్ణ రాజీనామా చేశారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి దర్నాసి రాజారావుపై వైసీపీ అభ్యర్థి మేరుగమల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications