కన్ఫ్యూజన్లో ఏదో: బాబు, జగన్కి 'వివేకానంద కర్మ' షాక్
హైదరాబాద్: గవర్నర్ తీర్మానం పైన జరిగిన చర్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో సమాధానం ఇచ్చే సమయంలో టిడిపి సభ్యులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. జగన్ మాట్లాడుతూ.. రైతు రుణాలు ఎప్పడు మాఫీ అవుతాయో చెప్పాలని, నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, అయితే దానిని అందరు ప్రభుత్వ ఉద్యోగాలుగా భావించారని, ఇప్పుడు మాత్రం ప్రయివేటు ఉద్యోగాలను కూడా కలుపుతున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు మూతపడినది వాస్తవం కాదా అన్నారు. నాడు విప్ జారీ చేసి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే రుణమాఫీ చేయాలన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు.

కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారన్న జగన్ వ్యాఖ్యల పైన దూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. జైలు నుండి విడుదలయ్యేందుకు, బెయిల్ కోసం కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో లాలూచీ పడితే తాము మద్దతివ్వాలా అని ప్రశ్నించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సభ హుందాతనాన్ని ఆగౌరవపరుస్తున్నారన్నారు. హామీల విషయంలో తాము స్పష్టతతో ఉన్నామని, రుణమాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని తాను అమలు చేస్తానని.. మీరు చూస్తుండాలన్నారు. అయితే కాస్త ఓపిక ఉండాలన్నారు. స్టడీ చేయకుండా వచ్చి అడిగితే ఎలా అన్నారు. ప్రజలు, రైతులు, తాము స్పష్టతతో ఉన్నామన్నారు. మీరు కన్ఫ్యూజన్ అయి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తాము ప్రజల కోసం చేస్తామన్నారు. ప్రజల భారం మోసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రమే రుణమాఫీ విషయంలో ఏం చేయలేకపోతుందని, లోటు బడ్జెట్ ఉన్న మన పరిస్థితి ఏమిటన్నారు. ఆర్బీఐ, కేంద్రం సహకారం అవసరమన్నారు. అయితే రుణమాఫీ మాత్రం కచ్చితంగా చేస్తామన్నారు. మీకు అంత తొందర ఉంటే.. దోచుకున్న వారు సొమ్ము ఇస్తే ఒక్క నిమిషం పని అన్నారు. ప్రభుత్వ ఖాళీలు అన్నింటిని భర్తీ చేస్తామన్నారు.
ఈ సమయంలో చంద్రబాబు.. సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వామి వివేకానందల సూక్తులను ఉటంకించారు. ఒకప్పటి కర్మ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామని... కాంగ్రెస్ పాలనను, వైయస్ పాలనను ఉద్దేశించి అన్నారు. ఒకప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నామని, ఈ రోజు నేను చేసే కర్మ ఫలితాలు రేపు బాగుంటాయని, ఎవరు భయపడవద్దన్నారు. కర్మ ఫలితాలు అని తాను చెప్పాక ఇక ఎవరు మాట్లాడరని తాను భావిస్తున్నానని చెప్పారు. కాగా, సభ నిరవధిక వాయిదా పడింది.












Click it and Unblock the Notifications