పవన్ కళ్యాణ్పై డైలమా, బిజెపిపై ఫైర్: బాబు ఒంటరి కానున్నారా?
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలో ఒంటరి కానున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టిడిపితో తెలంగాణలో తెగదెంపులు చేసుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.
ఏపీలోని బిజెపి నేతలు దాదాపు అదే ఆలోచనతో ఉన్నారని చెప్పవచ్చు. 2019 వరకు సొంతగా ఎదగాలని, సొంతగా ఏపీలో చక్రం తిప్పాలని బిజెపి భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కమలం పార్టీ పావులు కదుపుతోంది.
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ బిజెపి వెంట ఉన్నా లేకున్నా ఒంటరిగా ఎదగాలని భావిస్తోంది. బిజెపి కాపు నేతలు తెలుగుదేశం పార్టీపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీలో టిడిపికి అండగా నిలబడిన విష్ణు కుమార్ రాజు కూడా.. తమకు సభలో మాట్లాడేందుకు అవకాశం దొరకడం లేదని, ఇలాగే ఉంటే ధర్నా చేస్తామని హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతానికి బిజెపి - టిడిపి మధ్య స్నేహం కనిపిస్తున్నా.. అది మరెన్నాళ్లో ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి ఒంటరిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటోంది.
తాజాగా, చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశంలో షాకింగ్ కామెంట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, కేంద్రంపై ఇంకా ఒత్తిడి పెంచుతామని, అనుకున్నది సాదిద్దామని చెప్పారని తెలుస్తోంది.
శనివారం కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం టిడిపి మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ఏం చేసినా చేయకపోయినా పడి ఉంటామనుకుంటే సరికాదని, మనం ఏమీ సొంతానికి నిధులు అడగడం లేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు ఆగ్రహం చూసి టిడిపి నేతలు ఆశ్చర్యపోయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఒత్తిడి పెంచుదామని, అవసరమైతే ఎన్నిసార్లయినా తిరుగుదామని చెప్పారట. ఈ వ్యాఖ్యలు కేబినెట్ సమావేశం అనంతరం.. అంటే బిజెపి నేతలు వెళ్లిపోయాక చేశారని తెలుస్తోంది.
ఓ వైపు, మోడీ ప్రభుత్వంతో ఫైట్కు చంద్రబాబు సిద్ధపడటం, మరోవైపు, పార్టీ బలోపేతం కోసం వరుసగా చేరికలను ప్రోత్సహిస్తుండటం, ఇంకోవైపు బిజెపి దూరం జరగాలని భావిస్తుండటం, దీనికి తోడు పవన్ కళ్యాణ్ 2019 నాటికి ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో... ఏపీలో చంద్రబాబు లేదా టిడిపి ఒంటరి కానుందనే చర్చ సాగుతోంది.