రామతీర్ధంలో రాజకీయ రచ్చ ..పోటాపోటీగా చంద్రబాబు, విజయసాయి పర్యటన , టీడీపీ నేతల అరెస్ట్.. ఉద్రిక్తత
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం అయిన ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కంటే ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మార్పు కూడా రామతీర్థంలో పర్యటించనున్నారు. మూడు పార్టీలకు చెందిన నాయకుల పర్యటన నేపథ్యంలో రామతీర్థం లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
రామతీర్ధం ఘటనపై అధికార ప్రతిపక్షాల ఆరోపణలు
రామతీర్థంలో డిసెంబర్ 29వ తేదీన శ్రీరాముడు విగ్రహంపై దాడి చేసిన దుండగులు రాముడి శిరస్సు చేధించి రామ కొలనులో పడవేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై విజయ సాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాముడు విగ్రహం ధ్వంసం చంద్రబాబు పనేనంటూ, దీని వెనక టిడిపి నేతల హస్తం ఉందని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం నెలకొంది. ఈ నేపధ్యంలో రామతీర్ధంలో రాజకీయ వేడి రాజుకుంది .
పోటాపోటీగా రామాలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు , విజయసాయి రెడ్డి
నేడు చంద్రబాబు నాయుడు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన స్థలాన్ని పర్యటిస్తానని ప్రకటించిన తర్వాత, రామతీర్థం ఆలయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి కూడా సందర్శిస్తారని ప్రకటించారు. చంద్రబాబునాయుడు కంటే ముందే విజయ సాయి రెడ్డి రామతీర్థం ఆలయానికి వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఇక తాజా ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు, విజయసాయి పర్యటనలతో విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు తలనొప్పిగా రాజకీయ నాయకుల రగడ , సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారని ఆందోళన
పోలీసులకు తలనొప్పిగా రాజకీయ నాయకుల రగడ , సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారని ఆందోళన
పోలీసులు ఈరోజు రాజకీయ నాయకుల పర్యటనలను నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రామతీర్థం వార్డు మాజీ సభ్యులు సూరి బాబు, రాంబాబు లతో పాటుగా మరొకరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రామతీర్ధంలో పోటాపోటీగా టీడీపీ , వైసీపీ శిబిరాలు .. ఆందోళనలు
ఇక చంద్రబాబు తాజా పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆందోళన తెలియజేస్తున్న టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు . దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతలు పోటాపోటీగా శిబిరాలను ఏర్పాటు చేసి రామతీర్థం బోది కొండ దిగువన దీక్షలు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.