రాజధాని: బాబు ముందు అన్నీ సవాళ్లే, కెసిఆర్ ఎఫెక్ట్తో
హైదరాబాద్: కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. విభజన నేపథ్యంలో జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరుగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది. పైగా రాజధానిని నిర్మించుకోవాల్సిన ఉంది. హైదరాబాద్ అనుభవం దృష్ట్యా అధికార వికేంద్రీకరణ చేయాల్సి ఉంది. ఇలా చంద్రబాబు ముందు చాలా సమస్యలు ఉన్నాయి.
ఆర్ధికంగా పతనమైన ఆంధ్రప్రదేశ్ను అనుకున్న రీతిలో అభివృద్ధి చేయాలంటే లక్షల కోట్లు అవసరం. వాటిని ఎలా సమకూర్చుకోవాలి, ఏయే రంగాలకు ప్రాధాన్యతాపరంగా ఖర్చు చేయాలన్న అంశాలు చంద్రబాబుకు పెద్ద పరీక్షే. ఎపి అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి బాబు అహోరాత్రులు శ్రమించాల్సి ఉంది. సవాళ్ల పరిష్కారానికి లక్షల కోట్ల రూపాయలు అవసరం. అందులో కేంద్రం ఎంత వరకు వస్తాయనే దానిపై అభివృద్ధి ఆధారపడి ఉంది.
సాధ్యమైనన్ని నిధులు ఎలా తెచ్చుకోవాలనే అంశంపై అఫ్పుడే బాబు దృష్టి సారించారు. ముందుగా బాబు ఎదుర్కొనే ప్రధాన సవాలు కొత్త రాజధాని నిర్మాణమే. రాజధాని నిర్మాణం కోసం రెండు నుండి మూడు లక్షల కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ నిధులు సమీకరించాల్సి ఉంది. ఒకే రాష్ట్రానికి ఇంత భారీ నిధులను కేటాయించడం కేంద్రానికి కూడా కష్టతరమే. అంతేకాకుండా ఒకే రాష్ట్రానికి భారీ నిధులు ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది కూడా సమస్యగానే మారుతోంది. గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేసేందుకు బాబు ఆలోచిస్తున్నప్పటికీ, అందుకు ఇతర ప్రాంతాల నేతలను ఒప్పించాల్సిన అవసరం ఉంది. కర్నూలు నుంచి రాజధాని కోసం గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తిరుపతి, విశాఖపట్నంలను కూడా రాజధాని చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రజల నుంచే కాకుండా, సొంత పార్టీ నేతల నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయి. బాబు వారిని ఒప్పించాల్సి ఉంటుంది.

రుణమాఫీ బాబు ముందున్న మరో పెద్ద సవాల్. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ చేయాలంటే కనీసం లక్ష కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. ఎంత తగ్గించుకున్నా కూడా యాభై వేల కోట్లు భారం తప్పదని అంటున్నారు. అయితే తెలంగాణలో కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా కేవలం ఒక ఏడాది రుణాన్ని మాత్రమే మాఫీ చేసే భారం గణనీయంగా తగ్గుతుంది. అయితే ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు రూ.54,000 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
కెసిఆర్ నిర్ణయంపై ఇప్పటికే తెలంగాణలో విమర్శలు వస్తున్న అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక గతం నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించడం పెను సవాల్. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, పింఛన్లు, సబ్సిడీలు కూడా భారంగా ఉంటాయి. ప్రతి ఏటా వేల కోట్లు వీటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇందులో చాలామంది లబ్దిదారులు బోగస్గానే ఉండడంతో నిధులు అన్యాక్రాంతమవుతున్నట్లు విమర్శలు గత కొన్నాళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఈ భారం తగ్గించుకోవాల్సి ఉంది.
పారిశ్రామిక రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడం కూడా బాబు ముందున్న భారీ లక్ష్యం. ఇప్పటి వరకు హైదరాబాద్కే పరిమితమైన ఐటి, ఇతర పారిశ్రామికీకరణను ఇకపై విశాఖ, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, రాయలసీమ జిల్లాలకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా బాబుపై ఉంది. ఇప్పటికే కొంతమంది బాబును పరిశ్రమల స్థాపన కోసం సంప్రదిస్తున్నారు. వారికి ప్రోత్సాహకాలు కల్పించడం, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనువుగా ఉంటుందన్న విశ్వాసం బాబు కల్పించాల్సి ఉంది. వీటికి తోడు ఉద్యోగుల జీతాలు, పింఛన్లు.. ఇలా సమస్యల పైన చంద్రబాబు స్వారీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications