విజయసాయికి చంద్రబాబు కౌంటర్: అందుకే ఢిల్లీకి నారా లోకేష్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యసభకు ఎన్నికైన విజయసాయి రెడ్డి కార్యకలాపాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఓ కన్నేసి ఉంచాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ సాధారణమైన ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ కేసులు నమోదు కావడంతో వార్తల్లోకి వచ్చారు.
జగన్పై నమోదైన కేసుల్లో ఆయన కూడా నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో చక్రం తిప్పేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. జగన్కు అత్యంత విశ్వాసపాత్రుడైన విజయసాయి ఢిల్లీలో తన బాస్కు అనుకూలంగా పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
కాగా, విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకుని తనకు సమాచారం అందించాలని చంద్రబాబు కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నివేదించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, బిజీ పనులతో సుజనా చౌదరి ఆ పని చేయలేకపోతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో తన తనయుడు నారా లోకేష్ను ఢిల్లీకి పంపించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

విజయసాయి రెడ్డి వ్యూహాలకు ప్రతివ్యూహాలు రూపొందించి అమలు చేసే పనిలో నారా లోకేష్ ఉంటారని అంటున్నారు. వచ్చే మూడేళ్లు అత్యంత కీలకం కాబట్టి ఢిల్లీలో ప్రధానమైన నాయకుడు ఉండడం అవసరమని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో గానీ ఢిల్లీలో మాత్రం ఊహాగానాలు ముమ్మరంగానే సాగుతున్నాయి.
రాజ్యసభకు విజయసాయి రెడ్డి ఎన్నిక కాకుండా చూడడానికి చంద్రబాబు పెద్ద యెత్తే వేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మెజారిటీ శానససభ్యులను తన వైపు లాక్కుని నాలుగో అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దించి విజయసాయి రెడ్డి విజయాన్ని అడ్డుకోవాలని చూశారు.
అయితే, అందుకు అవసరమైనంత మంది వైసిపి శాసనసభ్యులు తన తెలుగుదేశం పార్టీలోకి రాకపోవడంతో ఆయన ఆలోచన కార్యరూపం దాల్చలేదు. దీంతో విజయసాయి రెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డికి పలు చోట్లకు వెళ్లేందుకు అవసరమైన వెసులుబాటు లభిస్తుంది. ఆ వెసులుబాటును ఉపయోగించుని జగన్కు అనుకూలంగా ఆయన పరిస్థితిని మార్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. అందుకే చంద్రబాబు దృష్టి ఆయనపై పడిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications