సత్యనాదేళ్ల ఆకర్షితులయ్యారు: బాబు, ఇంప్రెస్ చేయాలని
హైదరాబాద్: మన ఐటీ విధానాల పట్ల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆకర్షితులయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. చంద్రబాబు ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో ఇష్టాగోష్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
విభజన తర్వాత సెంటిమెంటుకు అంత ప్రాధాన్యం ఉండదని, ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధే అజెండా కావాలన్నారు. అమెరికాలోని వైద్యుల్లో ఎక్కువ శాతం మంది ఆంధ్రప్రదేశ్ వాళ్లేనని, అందులో గుంటూరు వాళ్లే చాలామంది ఉన్నారని చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు అంతకుముందు లేక్వ్యూ గెస్ట్ హౌస్లో ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. జాతిపిత గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్న జన్మభూమి-మా ఊరు, పలు సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు.
అధికారులు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అందరూ కష్టపడితే తప్ప ఫలితం సాధించలేమన్నారు. అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిరుద్యోగ యువతలో స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాలని, జన్మభూమి అవగాహణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు కొన్ని సందేహాలు వెలిబుచ్చారు. వారికి తగిన సూచనలు ఇచ్చారు. జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి జిల్లాల వారిగా ఐఎఎస్ అధికారులను ఇన్చార్జ్లను నియమించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ముందుకు వెళుతున్నామన్నారు.
బడి పిలుస్తోంది, నీరు- చెట్టు కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి అమలు చేస్తామన్నారు. కొత్త పథకాలను ప్రచారం చేసేందుకు పాటల్ని రూపొందించామన్నారు. గ్రామాలు, మండలాల్లో అమలును ఆరుగురు సభ్యుల టీం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఓ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పని చేసి తనను ఇంప్రెస్ చేయాలని హితవు పలికారు.