జగన్ కాన్వాయ్పై చెప్పు, తెలివితక్కువ అని బాబు ఫైర్
ఖమ్మం/నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఖమ్మం జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. జిల్లాలో జగన్ పర్యటన ఉన్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం సత్తుపల్లి సమీపంలో ఓ ఆందోళనకారుడు జగన్ కాన్వాయ్ పైకి చెప్పు విసిరి నిరసన వ్యక్తం చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగన్ పర్యటనను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన చేపడుతున్నారు. ఖమ్మంలో వద్ద వైయస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో బంద్ నిర్వహిస్తున్నారు. ఐకాస నేతలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వాగ్వాదం జరగడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
జగన్ పైన చంద్రబాబు ఆగ్రహం
తాము అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్లా చేస్తామన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే సీమాంధ్రను దోచుకొని మరో సింగపూర్ కట్టుకుంటారని విమర్శించారు. శ్రీవారి గుడి వద్దకు చెప్పులతో వెళ్లేంత తెలివి తక్కువ వ్యక్తి జగన్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో సైకిల్ బుల్లెట్లా దూసుకుపోతుందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి మెజార్టీ సీట్లు సాధిస్తుందన్నారు. గోతిలో పడ్డ కాంగ్రెసును భూస్థాపితం చేస్తామన్నారు. ప్రభుత్వంపై శ్రీవారికి కోపం రావడం వల్లే గాలిగోపురం కూలిపోయిందన్నారు. రాహు, కేతు పూజల్లో మోసాలు, రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు.