అంతర్వేది ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం: లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు.
జిల్లాలోని సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ఉంటుందీ ఆలయం. అంతర్వేది తిరునాళ్లుగా రాష్ట్రం మొత్తం గుర్తింపు పొందింది. అంతర్వేది ఆలయం వెలుపల నిర్మించిన షెడ్లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాల సందర్భంగా.. ఈ రథాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఆదివారం 3 గంటల సమయంలో హఠాత్తుగా షెడ్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల బారిన పడి రథం పూర్తిగా కాలిపోయింది.
మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై ఆలయ పాలక మండలి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల మంటలు చెలరేగిన వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలేమిటనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Recommended Video
ఈ ఘటన ప్రమాదవశావత్తు చోటు చేసుకుందా? లేక ఉద్దేశపూరకంగా గుర్తు తెలియని వ్యక్తలు ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా? అనేది తమ విచారణలో తేలుతుందని అన్నారు. ఆరు దశాబ్దాల కిందట ఈ రథాన్ని తయారు చేశారని, ఇప్పుడిలా మంటల్లో కాలిపోవడం అపశకునం అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రథాన్ని ఉంచే షెడ్డులో విద్యుత్ సరఫరా కోసం ఒకట్రెండు బల్బులు మాత్రమే ఉన్నాయని, షార్ట్సర్క్యూట్ సంభవించి, రథాన్ని దహనం చేసేంత స్థాయిలో ఓల్టేజీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.