విజయనగరంలో ముగిసిన జవాన్ రౌతు జగదీష్ అంత్యక్రియలు-అధికారలాంఛనాలతో
ఛత్తీస్ఘడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులతో పోరాడి వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండర్ రౌతు జగదీష్ పార్ధివ దేహానికి వేలాది మంది అశ్రునయనాల మధ్య ఇవాళ విజయనగరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అధికార లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం తరఫున జేసీ కిషోర్ కుమార్, ఆర్డీవో భవానీ శంకర్, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, పోలీసులు హాజరై నివాళులు అర్పించారు.
ఛత్తీస్ఘడ్ ఎన్కౌంటర్లో అమరుడైన రౌతు జగదీష్ మృతదేహాన్ని భారీ జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించి ఉదయం 9 గంటలకు విజయనగరం జిల్లా గాజులరేగ స్మశానవాటికకు తరలించారు. అధికార లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం జగదీష్ పార్ధీవ దేహం వద్ద అధికారులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు రాష్ట్రప్రభుత్వం తరఫున పోలీసులు కూడా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిగి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జగదీష్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

అమర జవాన్ రౌతు జగదీష్ అంత్యక్రియలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులు, ప్రజా ప్రతినిధుల రాకతో గాజులకేగ స్మశానం కిక్కిరికిపోయింది. జగదీష్ కుటుంబ సభ్యులను ప్రజాప్రతినిధులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే జగదీష్ కుటుంబానికి 30 లక్షల సాయం కూడా ప్రకటించింది. అంత్యక్రియల సందర్భంగా విజయనగరం జిల్లా గాజులరేగలో విషాదఛాయలు నెలకొన్నాయి.













Click it and Unblock the Notifications