చీటింగ్లో నయా ట్రెండ్: జిల్లా పరిషత్ కార్యాలయం పేరుతో డూప్లికేట్ వెబ్ సైట్
ప్రకాశం జిల్లా: మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఛీటింగ్ చేయడంలో కూడా క్రియేటివిటీ చూపిస్తున్నారు. అమాయకుల సొమ్ము కొల్లగొట్టడానికి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే?....
అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న కొంత మంది కేటుగాళ్లు వెరైటీ ఫ్లాన్ వేశారు. యువతకు బాధాకరంగా మారిన నిరుద్యోగ సమస్యని వీళ్లు మాత్రం క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఆలోచనకు సృజనాత్మకత జోడించి దోపిడీకి రంగం సిద్దం చేశారు. అన్ ఎంప్లాయడ్ యూత్ కి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలనే ఎర వేశారు....ఆ తరువాత అనుకున్నట్లే టార్గెట్ రీచ్ అయ్యారు...ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న వెరైటీ ఛీటింగ్ ఇది...అయితే ఆధునికత సాంకేతికత జోడించి గ్రామీణ యువతని వీరు మోసం చేసిన విధానాన్ని చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.

మోసం ఇలా...
ఈ రోజుల్లో కంప్యూటర్ గాని ఫోన్ గాని ఉపయోగించని అక్షరాస్యులు అతితక్కువ...సరిగ్గా ఇదే విషయాన్నిప్రకాశం జిల్లాలోని కొందరు మోసగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయంటూ ఇంటర్నెట్ ద్వారా వలవేశారు. ఏకంగా ప్రకాశం జిల్లా జడ్ పి కార్యాలయం పేరుతోనే నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయని ప్రకటనలు గుప్పించారు. అవి నిరుద్యోగులకు చేరేలా ప్లాన్ చేశారు. అంతే గవర్నమెంట్ ఉద్యోగం అందులోను ప్రకాశం జిల్లా పరిషత్ కార్యాలయంలో, పైగా జడ్ పి వెబ్ సైట్ లోనే ఈ ఉద్యోగాల వివరాలు ఉండటంతో నిరుద్యోగులు ఆశ పడ్డారు. ఆ ప్రకటనను తమకు పంపించిన వారిని సంప్రదించారు. దీనికోసమే ఎదురు చూస్తున్న కేటుగాళ్లు జడ్ పిలోనే ఉద్యోగాలని , అక్కడ తమకు తెలిసిన వాళ్లు కూడా ఉన్నారని నమ్మకం కలిగేలా మాట్లాడారు.

ఇలా క్యాష్ చేసుకున్నారు...
జడ్ పి వెబ్ సైట్ లో మీకు కావాల్సిన ఉద్యోగం ఎంపిక చేసుకోమని చెబుతారు. వీరు తమ ఛాయిస్ చెప్పగానే మీరు ఎంపిక చేసుకున్న ఉద్యోగానికి చాలా కాంపిటేషన్ ఉందని, కాకపోతే తెలిసిన వాళ్లు ఉన్నందున కొంచెం ఖర్చు పెట్టుకుంటే ఉద్యోగం వస్తుందని మాయమాటలు చెబుతారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పో సొప్పో చేసి నిరుద్యోగులు వీళ్లకు డబ్బు తెచ్చివ్వడం ఆ తరువాత వీళ్లు అడ్రస్ లేకుండా పోవడం ఇలా జరుగుతూనే ఉంది.

మోసం బైటపడిందిలా...
అయితే ఇలా డబ్బిచ్చిన కొందరు తమ దగ్గర డబ్బు తీసుకున్నవాళ్లు కనిపించక పోవడంతో ఏకంగా జిల్లా పరిషత్ సిఈవో దగ్గరకే వెళ్లి తమ ఉద్యోగం సంగతేమిటని అడిగారు. దీంతో నివ్వెరపోయిన ఆయన అసలు విషయమేమిటని అడిగాడు. ఆ తరువాత నిరుద్యోగులు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారు. ఆ తరువాత వారు చెప్పిన లింక్ ప్రకారం నెట్ ఒపెన్ చేసి చూసిన సిఈవో అక్కడ జడ్ పి వెబ్ సైట్ లాంటిదే నకిలీ వెబ్ సైట్ కనిపించడంతో షాక్ తిన్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా జిల్లా ఎస్పీ ఏసుబాబుకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ఈ నకిలీ జడ్ పి వెబ్ సైట్ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి
సారించారు. ఈ ఫేక్ వెబ్ సైట్ వెనుకున్నమోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే మరింతమంది నిరుద్యోగులు మోసపోకుండా ముందు నష్ట నివారణా చర్యలు చేపట్టారు.

పోలీస్ వారి హెచ్చరిక....
నకిలీ జడ్ పి వెబ్ సైట్ విషయం తెలిసిన వెంటనే విలేకరుల సమావేశం పెట్టిన మార్కాపురం పోలీసులు జడ్.పి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని, ఈ ఫైక్ వెబ్ సైట్లను నమ్మి అందులోని ఉద్యోగాల కోసం డబ్బులు పోగొట్టుకోవద్దని నిరుద్యోగులను హెచ్చరించారు.జడ్పి ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని మార్కాపురం సి.ఐ.ఎం.బీమానాయక్
ప్రకటించారు.

మోసపోయినవారు ఎందరో...
ఈ నకిలీ వెబ్ సైట్ బారిన పడి మార్కాపురం డివిజన్ లోని అర్దవీడు , బేస్తవారిపేట , కంభం , గిద్దలూరు మండలాల్లోని నిరుద్యోగులు చాలా మంది మోసపోయినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడయింది. మోసపోయినవారు సుమారు 100 మంది వరకు ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అసలు సూత్రధారి...
ఈ డూప్లికేట్ వెబ్ సైట్ వ్యవహారంలో అర్దవీడు మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రధాన సూత్రధారి అని విచారణలో తేలడంతో పోలీసులు అర్దవీడు పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు కూడా నమోదు చేశారు. జడ్పీ ఉద్యోగాల పేరుతో ఆ వ్యక్తి పలువురు నిరుద్యోగ యువకులను మోసం చేసి సుమారు రూ. 30,40 లక్షల వరకు వసూలు చేశాడని తెలిసింది. అతడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications