చెడ్డీగ్యాంగ్స్: గుజరాత్ నుండి ఏపీకి.. నిర్ధారించిన పోలీసులు, ఫోటోలు విడుదల; విజయవాడలో టెన్షన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ తిరుగుతున్నారు అన్న వార్తలు ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. మోస్ట్ డేంజరస్ గా చెప్పుకునే చెడ్డీగ్యాంగ్ ఏపీలో తిరుగుతున్నారని సమాచారం అటు ప్రజలకు, పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రజల భయాందోళన దూరం చెయ్యటానికి, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవటం కోసం రంగంలోకి దిగారు. అయితే ఏపీలో సంచరిస్తున్నది నిజమైన చెడ్డి గ్యాంగ్ నా లేక ఆ గ్యాంగ్ పేరు చెప్పుకొని మరెవరైనా దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేసిన విజయవాడ పోలీసులు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో దోపిడీలకు పాల్పడుతుంది నిజమైన చెడ్డి గ్యాంగ్ అని తేల్చారు. వారి ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు.
ఏపీకి గుజరాత్ దాహోద్ నుండి వచ్చిన చెడ్డీ గ్యాంగ్ .. పట్టుకునేందుకు 8 గ్యాంగులు
గుజరాత్ లోని దాహోద్ జిల్లా నుండి చెడ్డీ గ్యాంగ్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్ గా గుజరాత్లోని దాహోద్ జిల్లా పోలీసులను కలిసి చెడ్డి గ్యాంగ్ కు సంబంధించి కీలక వివరాలను రాబట్టారు. గుజరాత్ పోలీసులు ఏపీకి చెడ్డి గ్యాంగ్ వచ్చినట్టుగా ధృవీకరించారని సమాచారం. ఈ క్రమంలో చెడ్డీగ్యాంగ్ ను పట్టుకోవడం కోసం ఎనిమిది బృందాలను రంగంలోకి దించినట్టు విజయవాడ పోలీసులు వెల్లడించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికల నేపధ్యంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన విజయవాడ సిటీ పోలీసులు నగరం లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో రాత్రి వేళ్ళల్లో గస్తీ పెంచి, అనుమానితులను వేలి ముద్రల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నగర శివారు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే 100 నెంబర్ కు వెంటనే కాల్ చేయాలని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి సమయాల్లో తలుపులు తీసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలలోనూ, జన సంచారం ఎక్కువగా లేని ప్రాంతాలలోనూ చెడ్డి గ్యాంగ్ దోపిడీలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి నగర నగర శివారు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. విజయవాడ నగరంలోని శివారు ప్రాంతాలలోఅపార్ట్మెంట్స్ మరియు భవనాలలోనినివాసితుల భద్రత దృష్ట్యా,దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించినివాసితులకు అవగాహన కల్పిస్తున్నారు విజయవాడ నగర పోలీసులు.
చెడ్డీ గ్యాంగ్ లు దోపిడీకి పాల్పడిన ఇళ్ళను పరిశీలించిన సీపీ.. ప్రజలకు భరోసా
అంతేకాదు రాత్రి సమయంలో చెడ్డి గ్యాంగ్ సంచరించిన నేరస్థలాన్ని, కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కంపూడి సి.వి. అర్. ఫ్లై ఓవర్ సమీపంలో ఒక ఇంటిలో జరిగిన నేరస్థలాన్ని మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరంకి వసంత నగర్ కాలనీలో ఒక ఇంటిలో జరిగిన నేరస్థులను పోలీస్ కమిషనర్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా నేరం జరిగిన తీరు తెన్నులను తెలుసుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా బాధితులతో మాట్లాడి, నేరాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, నేరస్తులు త్వరలో గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. చెడ్డి గ్యాంగ్ ను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రం పోలీసుల సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నట్టు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు.
చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవటం కోసం విజయవాడ పోలీసుల ఫోకస్
ఏది ఏమైనా ఇంతకు ముందు హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన చెడ్డీగ్యాంగ్స్ , ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కలకలం రేపడం వరుస చోరీలకు పాల్పడడంతో ఏపీ వాసుల్లో ఈ గ్యాంగ్ పై భయం పట్టుకుంది. చెడ్డీలు,తలపాగాలు ధరించి, మారణాయుధాలతో , అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత పది మంది గ్యాంగ్ రంగంలోకి దిగుతారు. అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి అయినా వెనుకాడరు ఈ ముఠా.10 మంది సభ్యులు ఉండే ఈ గ్యాంగ్ లు సిసి టివి ఫుటేజ్ లో మాత్రమే కనిపించి, పట్టుబడకుండా మాయమై పోతుంటారు. ఎలాంటి ఇంటి తాళం అయినా ఒకే ఒక రాడ్డుతో చాకచక్యంగా తెరవగల నైపుణ్యం చెడ్డీ గ్యాంగ్ సొంతం. తప్పించుకునే వ్యూహాన్ని కూడా ముందే సిద్ధం చేసుకొని దొంగతనాలకు దిగుతారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో ఉన్న ఇళ్లనే దోపిడీకి ఎంచుకుంటారు. ఇక ఇటీవల ఈ గ్యాంగ్ వరుస దోపిడీలకు పాల్పడుతున్న క్రమంలో విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా ఈ గ్యాంగ్ ను పట్టుకోవటంపై దృష్టి పెట్టారు.