కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడ్ లైన్ - నిరహారదీక్షకు జోగయ్య సిద్దం..!!
ఏపీలో మరో సారి కాపు రిజర్వేషన్ల అంశం తెర మీదకు వచ్చింది. రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. కాపు రిజర్వేషన్ల గురించి చర్చ మొదలైంది. ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య సీఎం జగన్ కు లేఖ రాసారు. కాపులకు ఆమోదయోగ్యమైన ఉత్తర్వులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేసారు. నాడు చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు అయిదు శాతం ఇవ్వటానికి ప్రయత్నించిన సంగతి గుర్తు చేసారు. ప్రభుత్వ నిర్ణయానికి డెడ్ లైన్ విధించారు. లేకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు.
కాపు రిజర్వేషన్లపై జోగయ్య లేఖ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య లేఖ రాసారు. ఈ లేఖలోని అంశాలను మీడియాకు విడుదల చేసారు. కాపులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం లేదని ఆరోపించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో ప్రయత్నించిన విషయాన్ని జోగయ్య తన లేఖలో ప్రస్తావించారు.
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయం అమలు కాలేదని పేర్కొన్నారు. కాపులకు సంబంధించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని జోగయ్య ఆ లేఖలో డిమాండ్ చేసారు. ఈ నెల 31వ తేదీ లోగా ప్రభుత్వం స్పందించాలన్నారు. లేకపోతే తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని జోగయ్య స్పష్టం చేసారు.
వైసీపీ ప్రభుత్వ వాదన ఇలా..
గతంలోనే అగ్రవర్ణ పేదల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ల పైన అసెంబ్లీ వేదికగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు తాము అధికారంలో ఉన్న సమయంలో నిర్ణయించిన విధంగా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు అమలు చేస్తారా లేదా అని ప్రశ్నించారు. దీనికి సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కాపులు తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
దీనికి 2014లో టీడీపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే బీసీలను కాపుల్లో చేరుస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేసారు. ఇదే అంశం పైన మంజునాధ కమీషన్ వేసి..నివేదిక తీసుకుందని.. కానీ, కమిటీ నివేదిక పైన ఛైర్మన్ మంజునాధన్ సంతకం లేదని వివరించారు. ఆ తరువాత కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. కానీ, న్యాయ పరమైన అంశాలు - కోర్టు కేసులు ఈ వ్యవహారం లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాపులు బీసీల్లో చేర్చాలని కోరుతున్నారని గుర్తు చేసారు. తాము కాపులకు ఏం చేసేదీ తమ మేనిఫెస్టోలో స్పష్టం చేసామన్నారు.
ఎన్నికల వేళ మరోసారి కాపు రిజర్వేషన్ల అంశం
ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ అంశం కీలకంగా మారుతోంది. కాపులకు గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గతంలో ప్రభుత్వానికి లేఖ రాసారు. ఇప్పుడు హరి రామజోగయ్య ఈ నెల 31 లోగా ప్రభుత్వం కాపులకు సంబంధించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు.
దీంతో, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. తాగాజా పార్లమెంట్ లో ఈ అయిదు శాతం రిజర్వేషన్ల అంశం పైన బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇది చెల్లుబాటు అవుతుందా అంటూ స్పష్టత కోరారు. ఆ నిర్ణయం రాష్ట్రపరిధిలో తీసుకొనే నిర్ణయమని..తమ ఆమోదం అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో న్యాయ పరమైన అంశాలను ప్రస్తావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.