కాంగ్రెస్ నుంచి దేవినేని నెహ్రూ బహిష్కరణ: 'చంద్రబాబు రాజీనామా చేయాలి'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో దోషులెవరో తేల్చాలని ఏపీ పీసీసీ ఛీప్ రఘవీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని అన్నారు. అలా చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాగోతం బయటపడతుందని అన్నారు.
టీడీపీ సొంత ఇల్లు, కాంగ్రెస్ అద్దె ఇల్లు: వేరే జెండా ఎత్తడం ఇష్టం లేదన్న దేవినేని
ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబుకు ఏ మాత్రం నైతికత ఉన్నా వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. కాగా, మంగళవారం సీఎం చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూపై బహిష్కరణ వేటు వేశారు.
నెహ్రూతో పాటు ఆయన కుమారుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడియాల బుచ్చిబాబును కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు ఏపీ పీసీసీ ఛీప్ రఘవీరారెడ్డి మంగళవారం ప్రకటన చేశారు.
మంగళవారం ఉదయం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలసి దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 15వ తేదీన టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. టీడీపీ కొత్త పార్టీలా లేదని, నా సొంత ఇల్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మాత్రం అద్దె ఇల్లులా ఫీల్ అయ్యానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చానని చెప్పిన దేవినేని నెహ్రూ వేరే జెండా ఎత్తడం ఇష్టం లేకే టీడీపీలోకి చేరినట్టు తెలిపారు. పార్టీ తనకు కన్నతల్లితో సమానమని, పార్టీ నుంచి తానేమి ఆశించడం లేదని, పార్టీకి ఏం చేయగలుగుతానో అది మాత్రమే చేస్తానని అన్నారు.