కాదు మేమే అసలైన వారసులం...చెన్నంపల్లికోట వ్యవహారంలో ట్విస్ట్ మీద ట్విస్ట్
కర్నూలు జిల్లా: చెన్నంపల్లికోట తవ్వకాలలో మరో ట్విస్ట్ ఇది. ఈ కోటలో నిధి నిక్షేపాల కోసం అధికారులు తవ్వకాలు జరుపుతున్ననేపథ్యంలో త్రివిక్రమరాజు అనే వ్యక్తి ఈ కోట వారసులం తామంటూ అధికారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోటకు సంబంధించి మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇలా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో చెన్నంపల్లికోట వ్యవహారం మరింత వేడెక్కుతోంది.
కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో తవ్వకాలను ఆపేందుకు ఒక వారసుడు రంగంలోకి దిగి రెండు రోజులు గడవక ముందే ఇప్పుడు మరో వారసుడు తెర మీదకు వచ్చాడు. తవ్వకాలను ఆపితే మేము ఆపమనాలి గాని అలా చెప్పడానికి అతనెవరు అంటున్నారు. దీంతో చెన్నంపల్లి కోట వ్యవహారం మరింత రసకందాయం గా మారింది. చెన్నంపల్లికోట వారసులమంటూ త్రివిక్రమరాజు అనే వ్యక్తి డిసెంబర్ 24 న అధికారులను కలిశారు.
ఈ కోటకు తాము వారసులమని, తమ అనుమతి లేకుండా ఇక్కడ తవ్వకాలు జరపడం చెయ్యరాదని అధికారులకు తెలిపాడు. వెంటనే తవ్వకాలు ఆపకపోతే కోర్టును ఆశ్రయిస్తామని త్రివిక్రమరాజు అధికారులను హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ కోటకు సంబంధించి మరో వారసుడు రంగంలోకి దిగాడు. అసలు నిధే మాదంటూ మద్దికెర పాలెగార్ వంశానికి చెందిన వారసుడు ఇప్పుడు ఇక్కడ హల్ చల్ చేస్తున్నాడు.
లేటెస్ట్ ట్విస్ట్ ఇది...
అసలు ఈ కోట , ఈ కోట లోని నిధి నిక్షేపాలు తమకే చెందుతాయని, వీటితో పాటు ఈ కోటకు సంబంధించి 200 ఎకరాల భూమి ఉండాలని, అది కూడా లెక్క తేలాల్సి ఉందని మద్దికర పాలేకర్ వంశస్థులు అధికారులను ఆశ్రయించడం కలకలం సృష్టిస్తోంది. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి మెస్తో మన్రోసాహెబ్ ద్వారా తమ పూర్వీకులకు ఈ కోట సంక్రమించిందని పాలేకర్ వంశస్థులు స్పష్టం చేస్తున్నారు. కోటతో పాటు 200 ఎకరాల ఇనాం భూమి కూడా ఇచ్చారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని వారు అంటున్నారు. అసలు మేమే నిజమైన వారసులమని కావాలంటే విచారించుకోవచ్చని తేల్చిచెప్పేస్తున్నారు.
అంతకుముందు...
అంతకుముందు చెన్నంపల్లికోట వారసులం తామేనని, అక్కడ ప్రభుత్వం చేపట్టిన తవ్వకాలను వెంటనే ఆపాలని తుగ్గలి తహసీల్దార్ గోపాల్రావును ఆవుకు ప్రాంతానికి చెందిన త్రివిక్రమరాజు కోరారు. 1336లో గుత్తి పరిపాలన చేపట్టిన హరిహరరాయలు, బుక్కరాయల కాలం నుంచి తమ వంశవృక్షం అనవాళ్లు ఉన్నాయని పేర్కొన్న అతడు వంశవృక్షం, చెన్నంపల్లి కోట మ్యాప్ వివరాలతో పాటు పురావస్తు శాఖ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను ఆయన తహసీల్దార్కు అందించారు. ప్రస్తుతం తాను 14వ తరానికి చెందిన వాడినని, అప్పట్లో గుత్తి ప్రాంతాన్ని పరిపాలించిన తమ వంశీకులు చెన్నంపల్లి కోటతో పాటు పలు ప్రాంతాల్లో కోటలు నిర్మించారని తెలిపాడు.
అధికారులకు శిరోభారం....
అసలే 14 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నా నిధినిక్షేపాల జాడ లేక అల్లాడిపోతున్న అధికారులకు ఈ వారసుల వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. ఎవరికి వారు ఆధారాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఏవేవో పత్రాలు చూపించడం, వాటినే మీడియాకు కూడా చూపిస్తూ అధికారులకు హెచ్చరికలు జారీచెయ్యడం వారిపై ఒత్తిడిని మరింత పెంచుతోంది.
తవ్వకాలు 14 వ రోజుకు
మరోవైపు చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల కోసం ప్రభుత్వం చేపట్టిన తవ్వకాలు మంగళవారానికి 14వ రోజుకు చేరాయి. 30అడుగుల లోతు తవ్వాక బండరాళ్లు అడ్డురావడంతో అధికారులు 11వ రోజు తవ్వకాల దిశ మార్చేశారు. ఆదివారం 3అడుగుల మేర మట్టిని కూలీలు తొలగించారు. ఈ తవ్వకాల్లో రసాయనం పూసిన మట్టిపెళ్లలు బయటపడటం ఒ విశేషం.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సాయంతో....
నిధి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో ఫోటాన్ మేగ్నటో మీటర్ సాయంతో తెలుసుకొని వాటిని కనుగొని తీరతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోటలో బైట పడిన సొరంగం 30 అడుగుల తరువాత బండరాళ్లతో మూసుకుపోవడంతో గ్రావిటీ మీటర్ సాయంతో మరోవైపు ఆ సొరంగం మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ ఆధునిక పరికరాలను ముందే ఉపయోగించి నిధి గురించి ఒక అవగాహనకు వచ్చాకే అధికారులు ఈ తవ్వకాలు చేపట్టివుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గందరగోళానికి వారసుల వ్యవహారం తోడవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.